మే 20 వరకు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు పూర్తి చేయాలి: మంత్రి తన్నీరు హరీష్ రావు

by Shiva |
మే 20 వరకు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు పూర్తి చేయాలి: మంత్రి తన్నీరు హరీష్ రావు
X

దిశ, మెదక్ ప్రతినిధి: నూతన కలెక్టరేట్, జిల్లా పొలీసు కార్యాలయ భవనాలు, మే 20 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు చంద్రగౌడ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి నూతన కలెక్టరేట్ లో జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీలతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ప్రగతిలో ఉన్న ప్రహారీ, సీసీ రోడ్డు పనులు శరవేగంతో పూర్తి చేయాలని సూచించారు. రెసిడెన్షియల్ క్వార్టర్స్ లో పెయింటింగ్, శానిటరీ ఫిట్టింగ్ మిగిలిన చిన్న, చిన్న పనులను ముమ్మరం చేయాలన్నారు. 33 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ ఆవరణ అంతా ల్యాండ్ స్కేపింగ్ చేసి పచ్చటి వాతావరణం కనిపించేలా చక్కటి బయళ్లు ఏర్పాటుతో పాటు మొక్కలు నాటాలని, మీడియన్ లో చక్కటి మొక్కలు పెంచాలని సూచించారు.

అదేవిధంగా సివిల్ పనులు మొత్తం పూర్తైన జిల్లా పొలీసు కార్యాలయంలో ఫాల్ సీలింగ్, పెయింటింగ్, ఎలక్ట్రికల్ పనులు, సీసీ రోడ్లు, ప్రహారీ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. ఎస్పీ క్వార్టర్స్ చుట్టూ ప్రహారీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. అనంతరం రహాదారులు, భవనాల శాఖ నుంచి మెదక్, నర్సాపూర్, అందోల్, నారాయణ ఖేడ్, దుబ్బాక, గజ్వెల్ నియోజకవర్గాల్లో చేపట్టిన బీటీ రోడ్ల పునరుద్ధరణ పనుల ప్రగతిని సమీక్షిస్తూ 2021-22 సంవత్సరంలో రూ.16.20 కోట్ల వ్యయంతో 46కి.మీ అభివృద్ధికి 9 పనులు, 2022-23 లో రూ.49 కోట్ల వ్యయంతో 86 కి.మీ అభివృద్ధికి 13 పనులు చేపట్టేందుకు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని మంత్రి ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.

అదేవిధంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ క్రింద గిరిజన తండాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పధకం క్రింద మెదక్ నియోజకవర్గంలో రూ.43.77 కోట్ల వ్యయంతో 42.55 కి.మీ రహాదారి నిర్మాణానికి 25 పనులు, నర్సాపూర్ నియోజకవర్గంలో రూ.64.17 కోట్ల వ్యయంతో 81.21 కి.మీ. రహదారి నిర్మాణానికి 30 పనులు, నారాయణఖేడ్ నియోజకవర్గంలో సుమారు రూ.2కోట్ల వ్యవయంతో 3 కి.మీ రహాదారి నిర్మాణానికి 2 పనులు చేపట్టేందుకు వెంటనే టెండర్లు ఆహ్వానించాలని మంత్రి ఆదేశించారు.

అదేవిధంగా ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ క్రింద మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా నుంచి దయారా వరకు 2కి.మీ రహాదారి నిర్మాణానికి రూ.7.8కోట్లు మంజూరు చేశామని, ఆ పనులు కూడా కాంట్రాక్టర్ వెంటనే చేపట్టేందుకు టెండర్లు పిలవవలసినదిగా సూచించారు. కలెక్టర్, ఎమ్మెల్యే ఇంజనీరింగ్ అధికారులు సమావేశమై త్వరగా టెండర్లు ఫైనల్ చేసి ప్రతి నియోజకవర్గంలో పనులు ప్రారంభించేలా తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా కు సూచించారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ సూపరింటెండెంట్ ఇంజనీర్, కార్యనిర్వాహక ఇంజనీరు, ఏజెన్సీ ప్రతినిధి రమేష్ చాబ్రా, పొలీసు శాఖ నుంచి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

రేడియాలజీ హబ్ ప్రారంభం

మెదక్ ప్రభుత్వాసుపత్రిలో నూతనంగా నిర్మించిన రేడియాలజీ హబ్ ను రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షీ షా, జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోగులను ఆప్యాయంగా పలుకరించి అందుతున్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో పేషెంట్లకు అందిస్తున్న నూతన డైట్ ప్లాన్ అమలుపై వారినే అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలపై ఎన్ని మార్కులు వేస్తారని మంత్రి అడుగ్గా.. వందకు వంద మార్కులు వేస్తామని పేషెంట్లు చెప్పడంతో మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed