12 లైన్ల గ్రీన్ ఫీల్డ్ హైవేగా.. హైదరాబాద్.. బెంగుళూరు నేషనల్ హైవే

by Sumithra |
12 లైన్ల గ్రీన్ ఫీల్డ్ హైవేగా.. హైదరాబాద్.. బెంగుళూరు నేషనల్ హైవే
X

దిశ, జడ్చర్ల / మిడ్జిల్, రజాపూర్ /నవాబుపేట : హైదరాబాద్... బెంగుళూరు జాతీయ రహదారిని ‘‘12 లైన్ల” గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే గా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం ఉన్న రహదారిని విస్తరించేందుకు తీసుకోవల్సిన చర్యల గురించి సంభంధిత శాఖ ఉన్నతాధికారులు డీపీ ఆర్ పనులు మొదలుపెట్టారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ డీకే అరుణ, ఎమ్మేల్యేలు జనంపల్లి అనిరుద్రెడ్డి, జీఎంఆర్, వాకాటి శ్రీహరీ, యెన్నం శ్రీనివాస్రెడ్డి వీర్లపల్లి శంకర్ జిల్లా కలెక్టర్ విజయేంద్రి బోయి జిల్లా ఎస్పీ జానకితో కలిసి సోమవారం జడ్చర్ల నియోజకవర్గంలోని పలు మండలాల్లో రూ.138 కోట్లు కేటాయించి మంజూరు చేసిన రోడ్ల విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు.

బాలానగర్ నుండి జడ్చర్ల మండలం గంగాపూర్ వరకు రూ.56 కోట్లు కేటాయించి మంజూరు చేసిన సింగిల్ లైన్ బీటీ రోడ్డు నిర్మాణం పనులతో పాటు రాజాపూర్ మండల కేంద్రం నుండి కల్లేపల్లి మీదుగ రంగారెడ్డి గూడ వరకు రూ.30 కోట్లు, నవాబుపేట నుండితిర్మలాపూర్ వరకు రూ.20 కోట్లు, మిడ్జిల్ మండల కేంద్రం నుండి కొత్తపల్లి వయా వెలుగొమ్ముల, కొత్తూరు, చిల్వేరు మీదుగా నేషనల్ హైవే జడ్చర్ల రోడ్డు వరకు రూ.37 కోట్లతో మంజూరైన రోడ్ల పనులకు సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శంఖుస్థాపనలు చేసి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం జడ్చర్లలో ప్రెస్మీట్ ఏర్పాటు చేసి మీడియాతో మాట్లా డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఎనిమిది నెలలే కావొస్తుందని, మొదటి మూడు నెలలు ఎన్నికల కోడ్తోనే కాలం ముగిసిందని, కేవలం ఐదు నెలల్లోనే ప్రభుత్వం అనేక రకాల అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలో సుమారు రూ.20 వేల కోట్లు ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టారని, ఆ తర్వాత రాష్ట్రంలోని ఉద్యోగులకు నెల మొదటి తారీఖున జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం ప్రియారిటీ ఇస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం లోని పెన్షనర్లకు ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు చెల్లిస్తామని తెలిపారు.

అలాగే రూ.500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఆర్టీసీలో స్త్రీలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ రూ.10లక్షలకు వర్తింపు వంటి సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉండి నిరుద్యోగుల సమస్యను పట్టించుకోని కేసీఆర్, నేడు నిరుద్యోగ , ఉద్యో గ ఖాళీల గురించి మాట్లాడడం అవివేకమని అన్నా రు. అధికారంలోకి వచ్చిన ఎనమిది నెలల్లోనే 30 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు జరిపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. షెడ్యూల్ ప్రకారం డీఎస్సీకి సంభంధించిన పరీక్షలు నిర్వహిస్తామని, డిఫ్యూటీ సీఎం విక్రమార్క చెప్పినట్లు త్వరలోనే మరిన్ని ఉపాద్యాయ ఖాళీల భర్తికి సంభంధించి 5 వేల పోస్టులకు మరో డీఎస్సీ ప్రకటించనున్నట్లు తెలిపారు.

అనంతరం ఎంపీ డీకే ఆరుణ మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలుకు తాము కూడ పూర్తి స్థాయి సహకారం అందిస్తామని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని విద్య, వైద్యంతో పాటు రోడ్లు, రవాణా సదుపాయాల కల్పనకు కేంద్ర సహకారం అందేలా చూస్తానని తెలిపారు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కోత్వాల్, జడ్చర్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ నిత్యానందం, బుక్క వెంకటేశం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బాలత్రిపుర సుందరి, బీజేపీ జిల్లా గౌడ్ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సాహితీ రెడ్డి మిడ్జిల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్వాల్ రెడ్డి, మీనజ్, నిఖిల్ రెడ్డి హర్షద్, వంశీధర్ రెడ్డి, అనిల్ రెడ్డి, గౌస్, సంపత్ కుమార్, అబ్దుల్ సమి రమేష్ నాయక్ అశోక్ యాదవ్, బూర్ల వెంకటయ్య, శంకర్ నాయక్, రాంచంద్రయ్య,కృష్ణయ్య తదితరులు ఉన్నారు.

గడ్కరీ మంచోడు మంత్రి కోమటిరెడ్డి కితాబు..

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి చాలా మంచోడు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తాడు. ఆ తర్వాత అభివృద్ది, సంక్షేమంలో అన్ని పార్టీలను కలుపుకుపోతడని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని ఉద్దేశించి అన్నాడు. గతంలో తాను ఎంపీగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని రోడ్ల సమస్యల పై చెప్పుకుంటే ఉదారంగ స్పందించేవాడని అన్నారు. పార్టీలు వేరైన అభివృద్దిలో కలిసి ముందుకు సాగుదామని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణను ఉద్దేశించి అన్నారు.

స్కిల్ డెవలప్సెంటర్ కు మరిన్ని నిధులు - ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

జిల్లా కేంద్రంలో మంజూరైన స్కిల్ డెవలప్ సెంటర్ కు ప్రభుత్వం ఇప్పటికే రూ.10 కోట్లు మంజూరు చేసిందని, అదనంగా మరో రూ.10 కోట్లు మంజూరు చేయాలని మహాబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కోరారు. రాష్ట్రంలో పాలమూరు జిల్లా ప్రగతి గత పదేళ్ల కాలంలో వెనుకబడి పోయిందని, దీనికి అప్పటి సీఎం కేసీఆర్ కారణమని అన్నారు.

మాది కొబ్బరికాయల ప్రభుత్వం కాదు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి, మాది కొబ్బరి కాయల ప్రభుత్వం కాదని జడ్చర్ల ఎమ్మెల్యే జనం పల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం జారీ చేసిన అనేక జీవోలకు ఫైనాన్స్ అప్రూవల్ లేకుండా, అప్పటి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చిత్తు కాగితాలు చూపించి కొబ్బరి కాయలు కొట్టినట్లు ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఎనమిది నెలల్లోనే జడ్చర్ల నియోజ కవర్గానికి రూ.138 కోట్లు రోడ్ల విస్తరణ పనులకు మంజూరు చేయించడంతో పాటు టెండర్లు కూడ పూర్తి చేయించారు. అదే విధంగా జడ్చర్ల నియోజకవర్గం పరిధిలో బోయిన్పల్లి, జడ్చర్ల క్లబ్ రోడ్డు, సరుల్లాబాద్, నంనదారం, నేరళ్లపల్లి, రంగారెడ్డి గూడ మొత్తం ఆరు 33-11 కేవి సబ్ స్టేషన్ మంజూరు చేశారని తెలిపారు. దీనితో పాటు నవాబుపేట మండలం కొల్లూరు కేంద్రంగా 132-33 కేవి సబ్ స్టేషన్ త్వరలోనే మంజూరు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల కాంగ్రెస్ బీజేపీ పార్టీ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు

Advertisement

Next Story

Most Viewed