KTR: రైతు వ్యతిరేక పాలనలో దసరా.. దసరాగా లేదు: మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్

by Shiva |
KTR: రైతు వ్యతిరేక పాలనలో దసరా.. దసరాగా లేదు: మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం మూడు విడతల్లో రైతు రుణమాఫీ నిధులను వారి అకౌంట్లలో జమ చేసింది. అయితే, కొందరికి రేషన్ కార్డు లేకపోవడం, ఆధార్, బ్యాంక్ అకౌంట్లలో ఉన్న పేర్లలో తప్పులు దొర్లడంతో మొత్తం 5 లక్షల మంది అర్హులైన రైతులకు రుణమాఫీ (Loan waiver) కాలేదు. వారందరి జాబితాను అధికారులు కూడా సిద్ధం చేశారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధులను జమ చేస్తామని సంబంధిత అధికారులు వెల్లడించారు. మరోవైపు రబీ సీజన్ (Rabi season) వచ్చి పంటకోతలు మొదలైనా పెట్టుబడి సాయం ఇప్పటి వరకు అందకపోడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే రైతుల సమస్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ‘ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న సీఎం (CM)కు తెలంగాణ (Telangana) గల్లీల్లో తిరిగి చూసే ఓపిక లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది రైతన్నలు రూ.2 లక్షల రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. మరో 67 లక్షల మందికి పైగా రైతన్నలు రైతుబంధు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంతో 43 లక్షల మంది పత్తి రైతులు దళారుల చేతిలో దగాపడి అల్లాడుతున్నారని ఆరోపించారు. రైతు వ్యతిరేక పాలనతో ప్రజలకు దసరా.. దసరాలా లేదు’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed