రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేయాలి

by Sridhar Babu |
రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేయాలి
X

దిశ, ఖమ్మం : గ్రామాల్లోని రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం మంత్రి రఘునాథపాలెం మండలంలోని గ్రామాలలో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రఘునాథపాలెం మండలంలో మంత్రి పర్యటించి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ. 31.50 లక్షలతో హర్యా తండాలో చేపట్టిన అంతర్గత 8 సీసీ రోడ్లు, డ్రైన్ నిర్మాణ పనులకు, రూ. 33 లక్షలతో బద్యాతండాలో 7 సీసీ రోడ్లు, డ్రైన్ పనులకు, రూ. 38.50 లక్షలతో రాంక్యాతండాలో 10 సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాంక్యాతండాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల కోరిక మేరకు హెల్త్ సెంటర్ మంజూరు చేశామని, మంచి స్థలం ఎంపిక చేసుకుని నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరారు.

రాంక్యాతండాలో ఇండ్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను అందిస్తామని, ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులందరికీ అందజేస్తామని తెలిపారు. రాబోయే నెలలో మిగిలిన రైతులకు కూడా రుణమాఫీ పూర్తి చేస్తామని తెలిపారు. ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ తప్పనిసరిగా చేస్తామని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాలతో పంట నష్టం వస్తే రైతులకు పరిహారం అందేలా పంటల బీమా పథకాన్ని ప్రవేశ పెడతామని అన్నారు. రైతుల తరఫున పూర్తి స్థాయిలో బీమా సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి తెలిపారు. రఘునాథ పాలెం మండలంలో రైతులంతా ఆయిల్ ఫామ్ సాగు చేయాలని, కూరగాయలు, మిర్చి పంట వేసుకునే రైతులంతా వారి పొలాలలో ఆయిల్ ఫామ్ మొక్కలు వేస్తే 50 వేల రూపాయలు సబ్సిడీ కింద అందిస్తామని, ఆయిల్ ఫామ్ మొక్కలు, డ్రిప్ ను ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తుందని తెలిపారు.

Letest Telugu Newsఅంతర్ పంటల కింద కూరగాయలు, ఇతర పంటల సాగుతో 3 సంవత్సరాల వరకు ఆదాయం వస్తుందని అన్నారు. సంవత్సరపాటు రాంక్యాతండాకు సాగర్ నీరు అందించే బాధ్యత తీసుకుంటానని, గతంలో పుట్టకోట ప్రాజెక్టు నుంచి పైప్ లైన్ వేసి మంచినీళ్లు అందించామని, రఘునాథ పాలెం మండలంలో 25 కోట్లతో నూతన రోడ్లు, డ్రైన్లు మంజూరు చేశామని తెలిపారు. మండలంలో అడిగిన అన్ని డొంక రోడ్లకు రూ.50 కోట్లు అందిస్తామని పేర్కొన్నారు. రఘునాథపాలెం మండలంలోనే ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. అనంతరం మంత్రి రాంక్యా తండాలో కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షక కవచం భద్రత కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విల్సన్, ఎంపీడీఓ అశోక్, పంచాయతీ రాజ్ డీ ఈ మహేష్ బాబు, ఏఈ చిరంజీవి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed