మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ‘ఆవేశం స్టార్’: MLA కౌశిక్ రెడ్డి మాస్ సెటైర్

by Satheesh |
మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ‘ఆవేశం స్టార్’: MLA కౌశిక్ రెడ్డి మాస్ సెటైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేశం స్టార్ అని, ఫ్లైయాష్‌లో రూ.100కోట్లు స్కాం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి బుధవారం నాటకీయ పరిణామాల మధ్య చేరుకున్నారు. బ్లాక్ బుక్ మొదటి పేజీలో మంత్రి పొన్నం పేరు రాశారు. ఈ సందర్భంగా మీడియాతో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. తాను విసిరిన సవాళ్లను స్వీకరించి మంత్రి ప్రభాకర్ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి తాను ఫ్లై యాష్ రవాణా విషయంలో అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేస్తారని భావించానన్నారు. కానీ రాలేదని ఆరోపించారు. ఫ్లై యాష్ విషయంలో 100 కోట్ల అవినీతికి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్పడ్డారని తాను ఆరోపిస్తే ఇప్పటివరకు మంత్రి పెదవి విప్పలేదన్నారు. ఆరోపణలపై నాకు లీగల్ నోటీసు పంపించారని, మంత్రి లీగల్ నోటీసులకు భయపడేది లేదన్నారు. అవినీతికి పాల్పడలేదని పొన్నం ప్రభాకర్ ప్రమాణం చేస్తే తాను క్షమాపణ చెప్తానని కూడా బహిరంగంగా ప్రకటించానన్నారు. 100 కోట్ల స్కాం చేసినట్లు పరోక్షంగా మంత్రి అంగీకరించినట్లయిందన్నారు.

నా నిజాయితీని హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల ముందు, యావత్ తెలంగాణ ప్రజలకు నిరూపించుకున్నానన్నారు. అధికారులు, మంత్రులు ఎవరు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారో వారందరి వివరాలు బ్లాక్ బుక్‌లో నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతారని, అవినీతికి పాల్పడుతున్న అధికారులకు మంత్రులకు మళ్లీ బ్లాక్ డేస్ రాక తప్పదని హెచ్చరించారు. సీఎంగా కేసీఆర్ మళ్లీ వచ్చిన తర్వాత పొన్నం ప్రభాకర్ తిన్న 100 కోట్లు కక్కిస్తామన్నారు. ఆరు గ్యారెంటీ ల పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు స్కాములు చేశారని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు మాత్రం అమలు చేయలేదన్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం పేరు చెప్పి కోట్ల రూపాయల టికెట్ స్కాం చేయలేదా..? అని ప్రశ్నించారు. ఇవన్నీ చేయలేదని ప్రమాణం చేసే దమ్ము లేకనే వేంకటేశ్వరస్వామి ఆలయానికి రాలేదని ఆరోపించారు.

Advertisement

Next Story