‘గిరిజనులకు CM రేవంత్ ఇచ్చింది గాడిద గుడ్డే’

by Satheesh |
‘గిరిజనులకు CM రేవంత్ ఇచ్చింది గాడిద గుడ్డే’
X

దిశ, తెలంగాణ బ్యూరో: చేవెళ్ల ట్రైబల్ డిక్లరేషన్ ఇచ్చిన హామీలకు బడ్జెట్ కేటాయించకుండా మరోసారి గిరిజనులను మోసం చేసిన రేవంత్ సర్కార్ వారికి ఇచ్చింది గాడిద గుడ్డు అని బీజేపీ గిరిజన మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కల్యాణ్ నాయక్ విమర్శలు చేశారు. బీజేపీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో చేవెళ్ల ట్రైబల్ డిక్లరేషన్‌లో ఇచ్చిన ప్రకారం బడ్జెట్ కేటాయించకుండా గిరిజనులకు మోసం చేయడంపై గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నం చేశారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం కల్యాణ్ నాయక్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలన చేతకావడంలేదని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యాజ్యోతి పథకం, మైదాన ప్రాంత గిరిజనుల కోసం నూతనంగా ఐటీడీఏ కేంద్రాల నిర్మాణం హామీ ఏమైందని కల్యాణ్ నాయక్ ప్రశ్నించారు.

అంబేద్కర్ అభయహస్తం కింద రూ.12 లక్షల ఆర్థికసాయం ఏమైందని, గిరిజన గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఏటా రూ.25 లక్షల హామీ ఏమైందని ఆయన నిలదీశారు. గాంధీభవన్ ముట్టడికి యత్నించిన గిరిజన మోర్చా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. నాయకులను అరెస్టు చేసి బొల్లారం పీఎస్ కు తరలించారు. ఈ నిరసనలో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూనావత్ రవి నాయక్, రాష్ట్ర కార్యదర్శి అమ్మ శ్రీను, ఆర్గనైజింగ్ సెక్రెటరీ మహేష్ రూపావత్, పడ్త్యా నాయక్, భాస్కర్ నాయక్, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, గిరిజన మోర్చా నాయకులు పాల్గొన్నారు.



Next Story