మధ్యతరగతి ప్రజలను బెంబెలెత్తిస్తున్న హైడ్రా : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

by Y. Venkata Narasimha Reddy |
మధ్యతరగతి ప్రజలను బెంబెలెత్తిస్తున్న హైడ్రా : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
X

దిశ, వెబ్ డెస్క్ : చెరువుల పరిరక్షణ పేరుతో హైడ్రా సాగిస్తున్న కూల్చివేతల పర్వంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బెంబెలెత్తిపోతున్నారని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూకట్‌పల్లి నల్లచెరువులో హైడ్రా నిర్వహించిన కూల్చివేతలను తప్పుబట్టారు. నల్లచెరువులో కూల్చివేతలు చేపట్టిన స్థలం పట్టాదారులకు చెందిందని, వారికి ఎలాంటి పరిహారం ఇవ్వకుండా ప్రైవేట్‌ వ్యక్తుల భూములను ఎలా స్వాధీనం చేసుకుంటారని ప్రశ్నించారు. కూకట్‌పల్లి నల్ల చెరువు పూర్తి విస్తీర్ణం 27 ఎకరాలు కాగా.. అందులో 7.30 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ శిఖం భూమని, మిగిలిన భూమంతా ప్రైవేట్‌ వ్యక్తులకు పట్టాలు ఉన్నాయన్నారు. చెరువు ఎఫ్‌టీఎల్‌లోని పట్టా భూముల్లో వెలిసిన నిర్మాణాలపై హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా కూల్చివేశారన్నారు. కూల్చివేతలతో నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలని కోరారు. చెరువులలో పట్టాలు ఉన్న వారికి నష్టపరిహారం చెల్లించి ఆ స్థలాన్ని ప్రభుత్వం తీసుకొని చెరువులను కాపాడుతూ అభివృద్ధి చేయాలని సూచించారు. అసెంబ్లీ సమావేశం నిర్వహించి, ఉన్నతస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి చెరువుల విస్తీర్ణంపై చర్చించాలన్నారు. శనివారం, ఆదివారం వస్తుందంటే హైదరాబాద్‌లో ప్రజలు భయంతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, హైడ్రా కమిషనర్‌ వ్యాఖ్యలకు ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారన్నారు. హైడ్రా కూల్చివేతలు చేశాక నిర్మాణ వ్యర్థాలు తీసివేయకుండా, చెత్తను జమ చేస్తున్నారని, వాటిని తీయకుండా చెరువును ఏవిధంగా కాపాడుతారని ప్రశ్నించారు.

ప్రభుత్వం తీరుతో అధిక శాతం సామాన్య, మధ్యతరగతి జనమే నష్టపోతున్నారన్నారు. చెరువుల భూముల పరిధిపై స్పష్టత లేని కారణంగా, కూకట్‌పల్లి ఖాజకుంటలో ఇద్దరు జడ్జిలు స్థలాలను కొనుగోలు చేసి ఇబ్బందులు పడుతున్నారని, ఇక సామాన్యులకు ఎలా తెలుస్తుందన్నారు. ఆయా ప్రాంతాల్లోని చెరువుల విస్తీర్ణంతో పాటు ఆ చెరువు పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు, పట్టా భూములను గుర్తించాలని, చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లపై స్పష్టతనివ్వాలన్నారు. ఆయా చెరువుల్లో ఎంతవరకు ఆక్రమణలు జరిగాయో తేల్చాలన్నారు. నగరంలో 600లకు పైగా చెరువులు ఉండగా.. నేడు 180 చెరువులు మాత్రమే కనిపిస్తున్నాయని, ఎవరి హయాంలో చెరువులు మాయమైపోయాయో సమాధానం చెప్పాలన్నారు.

హైడ్రా ముసుగులో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం యత్నిస్తుందన్నారు. హైడ్రా పేరుతో నగరంలోని చెరువులు, కాలువల పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలు భయంతో బతుకాల్సిన పరిస్థితులు తీసుకొచ్చారని మండిపడ్డారు. గతంలో కూకట్‌పల్లిలోని నల్ల చెరువును అభివృద్ధి చేయడానికి ప్రయత్నించిన ప్రతిసారి పట్టా భూములు కలిగిన వ్యక్తులు కోర్టులను ఆశ్రయించారని తెలిపారు. కోర్టు ఆదేశాలను పాటించడం వల్లే అభివృద్ధి పనులు ఆగిపోయాయన్నారు. చెరువు సందరీకరణలో భాగంగా 2017లో రూ.రెండు కోట్లు వెచ్చించి చెరువు కట్టను ఏర్పాటు చేస్తే.. హైకోర్టు ఆదేశాలతో ఆ కట్టను రెండు రోజుల్లోనే తొలగించాల్సి వచ్చిందన్నారు. చెరువులో మురుగు నీటిని శుద్ధి చేసేందుకు 50 కోట్లతో ఎస్‌టీపీ పనులను ప్రారంభిస్తే.. ఆ పనులు కూడా కోర్టు ఆదేశాలతో ముందుకు సాగలేదన్నారు. న్యాయస్థానం తీర్పును గౌరవిస్తూ.. చెరువును అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

Next Story

Most Viewed