తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు.. అధ్యక్షుడిగా లచ్చిరెడ్డి

by Nagam Mallesh |
తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు.. అధ్యక్షుడిగా లచ్చిరెడ్డి
X

దిశ, హిమాయత్ నగర్ః తెలంగాణలో ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆవిర్భవించింది. డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి. లచ్చిరెడ్డి ఛైర్మన్ గా ఉద్యోగుల జేఏసీ పురుడు పోసుకుంది. వారసత్వ నాయకత్వంలో నడుస్తున్న టీజీవో, టీఎన్జీవో ఉద్యోగుల జేఏసీకి చెక్ పెడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు కావడం విశేషం. ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, సీపీఎస్, పెన్షన్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ గా డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి.లచ్చిరెడ్డిని 65 సంఘాల నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వి.లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. గ‌త ప్ర‌భుత్వ ప‌దేళ్ల పాల‌నాకాలంలో ఉద్యోగుల విష‌యంలో జ‌రిగిన పొర‌పాట్లు, ఉద్యోగుల‌కు జ‌రిగిన అన్యాయాలు మ‌ళ్లీ పున‌రావృతం కావొద్ద‌నే ఆలోచ‌న‌తోనే మేమంతా ఏక‌తాటిపైకి వచ్చామన్నారు. వార‌స‌త్వంగా వ‌స్తున్న ఉద్యోగ సంఘాలు గ‌తంలో చేసిన ఘ‌న‌కార్యాల‌ను చూసి ఆవేద‌న‌తో మేము ఏక‌మ‌య్యాం అని తెలిపారు. భ‌విష్య‌త్తులో ఆ సంఘాలు మ‌ళ్లీ ఉద్యోగుల‌ను మోసం చేయొద్ద‌ని, వాటి గుత్తాధిప‌త్యం ఉండొద్ద‌నేది మా అంద‌రి ఆలోచ‌న‌ పేర్కొన్నారు. 610 జీవో అన్యాయంపై పోరాడి తెలంగాణ తెచ్చుకుంటే, వ‌చ్చిన తెలంగాణ‌లో 317 జీవో కింద 50 వేల ఉద్యోగాలు పోతున్నా ఆ సంఘాలు మాట్లాడ‌లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల‌కు హెల్త్ పాల‌సీ తెస్తామ‌ని ఆ సంఘాలు 2014లో హ‌డావుడి చేసినా పాల‌సీ తేలేదన్నారు. ప‌దేళ్ల‌లో ఉద్యోగ‌, ఆర్టీసీ కార్మిక సంఘాల‌ను నిర్వీర్యం చేసినా, ఆర్టీసీ, ఉద్యోగ నాయ‌కుల‌ను ఇబ్బందిపెట్టినా ఆ సంఘాలు ఏనాడూ మాట్లాడ‌లేదని చెప్పారు.

ఆర్టీసీ కార్మికులు మ‌ర‌ణిస్తున్నా ప‌ట్టించుకోని సంఘాలు ఇప్పుడు ఉద్యోగుల‌కు న్యాయం చేస్తామ‌ని అంటున్నాయి. గత ప్రభుత్వంలో ఉద్యోగుల‌కు ఇంత అన్యాయం జ‌రుగుతున్నా, స్వేచ్ఛ లేక‌పోయినా నోరెత్త‌ని సంఘాలు, ఇప్పుడు కొత్త ప్ర‌భుత్వంలో స్వేచ్ఛ దొరికింద‌ని బ‌య‌ట‌కువ‌స్తున్నాయని చెప్పారు. తాము ఆ సంఘాల‌కు పోటీగా ముందుకు రావ‌డం లేదని.. ఆ సంఘాల గుత్తాధిప‌త్యం రాచ‌రికంలా ఉండొద్ద‌ని, ఉద్యోగుల‌ను ప‌ట్టించుకోకుంటే ఇక‌ కుద‌ర‌ద‌ని చెప్పేందుకే ఏక‌మ‌య్యామన్నారు. ఇందుకు గానూ ఉద్యోగుల వైద్యం, హౌజింగ్‌, వెల్ఫేర్ వంటి అంశాల‌పై ప్ర‌త్యేక క‌మిటీలు వేసి, అంద‌రి అభిప్రాయాలు తీసుకొని విధానాల‌కు రూప‌క‌ల్ప‌న చేస్తామన్నారు లచ్చిరెడ్డి. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ, విద్య, న్యాయ, విద్యుత్, మెడికల్, కమర్షియల్ టాక్స్, రెవెన్యూ, జలమండలి, మున్సిపల్, వ్యవసాయ, సీపీఎస్ ,ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, పిసిబి, తదితర ప్రభుత్వ శాఖల, సంస్థల నుంచి ఉద్యోగ సంఘాల నాయకులు, అశ్వత్థామ రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు నిర్మల, లక్ష్మారెడ్డి, సంపత్ కుమార్, హర్షవర్ధన్ రెడ్డి, కుమారస్వామి, మైపాల్ రెడ్డి, షౌకత్ అలీ, శ్రీకాంత్ ,గరిక ఉపేందర్ రావు, గోపాల్ రెడ్డి, కే రామకృష్ణ, ఎస్ రాములు, రమేష్ పాక, ఫుల్ సింగ్ చౌహాన్, హరికిషన్, తిరుపతి నాయక్, డాక్టర్ కత్తి జనార్దన్, మేడి రమేష్ దేవికా రొక్కం, మమత, వాణి సక్కుబాయి, కమలాకర్ , తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed