దుర్గం చెరువు నివాసితులకు హైకోర్టు ఊరట

by Y. Venkata Narasimha Reddy |
దుర్గం చెరువు నివాసితులకు హైకోర్టు ఊరట
X

దిశ, వెబ్ డెస్క్ : దుర్గం చెరువు చుట్టూ కూల్చివేత చర్యలపై హైకోర్టు స్టే విధించింది. 2014లో జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై దుర్గం చెరువు ప్రాంత వాసులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అభ్యంతరాలను పరిశీలించాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీని కోర్టు ఆదేశించింది. దుర్గం చెరువు నిర్వాసితులు అక్టోబర్‌ 4న సరస్సు పరిరక్షణ కమిటీ ఎదుట హాజరుకావాలని సూచించింది. వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని అక్టోబరు 4 నుంచి ఆరు వారాల్లోగా తుది నోటిఫికేషన్‌ జారీ చేయాలని లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీని హైకోర్టు ఆదేశించింది. కాగా దుర్గం చెరువు ఆక్రమణ పరిధిలోని నివాసితుల్లో సీఎం సోదరుడు ఎనుముల తిరుపతి రెడ్డి కూడా ఉండటం గమనార్హం. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తూ వస్తున్న హైడ్రా.. ఎనుముల తిరుపతి రెడ్డి ఇల్లు, కార్యాలయంతో సహా పలు ప్రముఖుల నిర్మాణాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. వాటిని 30 రోజుల్లోగా తొలగించాలని నోటీసులు అంటించారు. దీంతో కూల్చివేత నోటీసులను సవాల్ చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు. 6 వారాల్లోపు కూల్చివేతలు చేపట్టబోమని కోర్టుకు జీహెచ్​ఎంసీ తెలిపింది. రికార్డుల ప్రకారం దుర్గం చెరువు ఎఫ్​టీఎల్​ 65 ఎకరాలే ఉందని పిటిషనర్లు హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. దుర్గం చెరువు ఎఫ్​టీఎల్​ 160 ఎకరాలు ఉందని అధికారులు చెప్పడం సరికాదని పిటిషనర్లు వాదించారు.

మాదాపూర్‌లోని అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో ఎనుముల తిరుపతి రెడ్డి నివాసం ఉంటున్న ఇల్లు.. దుర్గం చెరువు ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఉన్నట్లు గుర్తించి ఆగస్టు 29న నోటీసులు అంటించారు అధికారులు. దీనిపై ఎనుముల తిరుపతి రెడ్డి స్పందించారు. తాను ఆ ఇంటిని 2015లో కొనుగోలు చేశానని.. అది ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందనే విషయం తనకు తెలియదని తిరుపతి రెడ్డి తెలిపారు. తాను నివాసం ఉంటున్న ఇల్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకున్న తనకు అభ్యంతరం లేదని తిరుపతి రెడ్డి తెలిపారు. చెరువులు, అటవీ స్థలాలను పరిరక్షించేందుకు హైడ్రా చేపడుతున్న విస్తృత చర్యల్లో భాగంగా వారు ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని ఆయన గతంలో స్పష్టం చేశారు.

కాగా ఆక్రమణల కారణంగా దుర్గం చెరువు విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. దశాబ్దం కింద ఈ ఏరియాను నాన్-డెవలప్‌మెంట్ జోన్ (ఎన్‌డిజెడ్)గా గుర్తించారు. కానీ దీనికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో చెరువు విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది. రాజకీయ నాయకులు, ఇంజినీర్లు, రిటైర్డ్ బ్యూరోక్రాట్‌లు, ఎంతోమంది ఉన్నత స్థాయి వ్యక్తులు ఈ చెరువు చుట్టూ.. ఆక్రమణకు గురైన ప్రాంతాల్లో నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. వారిలో చాలామందికి అధికారులు తాజాగా నోటీసులు ఇచ్చారు.

Next Story

Most Viewed