తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీపికబురు.. హైదరాబాద్-విజయవాడ హైవేపై ఫ్లై ఓవర్

by Rajesh |
తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీపికబురు.. హైదరాబాద్-విజయవాడ హైవేపై ఫ్లై ఓవర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉభయ తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలను అనుసంధానం చేసే హైదరాబాద్- విజయవాడ హైవేపై ట్రాఫిక్ కష్టాలు కొంతమేర తీరనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో భారీ ఫ్లైఓవర్ నిర్మాణం జరగనుంది. తహశీల్దారు ఆఫీసు నుంచి పద్మావతి ఫంక్షన్‌ హాల్ వరకు 2 కి.మీ. పొడవున నిర్మించనున్నారు. ఈ ఫ్లైఓవర్‌కు మొత్తం రూ.82 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. వంతెన నిర్మించే ప్రదేశం గట్టిదనం పరంగా అనుకూలంగా ఉందని నిర్ధారణ కావడంతో పనులు మరింత వేగంగా జరిగేందుకు చాన్స్ ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ ఫ్లైఓవర్‌కు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ త్వరలో శంకుస్థాపన చేయనున్నట్టు సమాచారం.

రెండు వారాల్లో పనులు ప్రారంభించే చాన్స్

ఫ్లైఓవర్ నిర్మాణ సమయంలో వాహనాల రాకపోకలకు ఏలాంటి ఇబ్బంది లేకుండా ఇరువైపులా జాతీయ రహదారులు సంస్థ అధికారులు సర్వీస్ రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టారు. ముందుగా వలిగొండ అడ్డ రోడ్డు నుంచి పద్మావతి ఫంక్షన్‌హాల్‌ వరకు 500 మీటర్ల మేర ఈ వంతెన పనులు..మరో వారం, పది రోజుల్లో పూర్తవుతాయని అధికారులు పేర్కొన్నారు. కాకపోతే ఒకవైపు ఈ పనులు పూర్తయిన తర్వాతే రెండోవైపు చేపడుతామని చెప్పారు. ఫ్లైఓవర్‌ నిర్మాణ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న హర్యానాకు చెందిన రాంకుమార్‌ కన్‌స్ట్రక్షన్స్‌..నిర్మాణ పనులను రెండు వారాల్లో ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై నిత్యం సంభవిస్తున్న ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పటి నుంచే కోరుతున్నారు. ఆయన అనేక సార్లు ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి, నిధులు మంజూరు చేయించారు. ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాలను(బ్లాక్‌ స్పాట్స్) గుర్తించి నిర్మాణానికి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం నిధులు మంజూరు చేసింది.

Advertisement

Next Story