Fraud: జనం సొమ్ముతో యథేచ్ఛగా దందా..! అధిక వడ్డీ ఆశచూపి భారీగా వసూళ్లు

by Shiva |
Fraud: జనం సొమ్ముతో యథేచ్ఛగా దందా..! అధిక వడ్డీ ఆశచూపి భారీగా వసూళ్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘రూ.లక్ష పెట్టుబడి పెట్టండి. ప్రతి నెలా రూ.9 వేల వంతున 20 నెలలు ఇస్తాం. అంటే రూ.లక్షకు రూ.1.80 లక్షలు వస్తాయి’ అంటూ వెల్ విజన్ ట్రేడర్స్.. పెట్టుబడి పేరిట ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నది. కేపీహెచ్ బీ కాలనీలో షోరూం పెట్టి.. హోం అప్లయెన్సెస్ వ్యాపారం చేస్తున్నట్టు చెబుతున్నది. ముఖ్యంగా ఎల్జీ, సామ్ సంగ్ కంపెనీ ప్రొడక్ట్స్ బిజినెస్ చేస్తున్నట్టు వివరిస్తున్నది. దీంతో ఇప్పటికే సుమారు 500 మందికి పైగా ఈ బిజినెస్ లో పెట్టుబడి పెట్టినట్టు ఆ ట్రేడర్స్ ఏజెంట్ ‘దిశ’కు వివరించారు. అంతేకాకుండా శని, ఆదివారాల్లో స్పెషల్ ఆఫర్లు ప్రకటించారు. రూ.2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఒక గ్రాము గోల్డ్, రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 3 గ్రాముల గోల్డ్, రూ.6 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 4 గ్రాముల గోల్డ్ ఇస్తామంటున్నారు. అంతేకాకుండా రూ.100 విలువైన బాండ్ పేపరు మీద పరస్పర అంగీకారపత్రం కూడా రాసిస్తారు. రూ.2 లక్షల విలువైన పోస్ట్ డేటెడ్ చెక్కులు కూడా ముందే ఇస్తారు.

అంత వడ్డీ ఎలా సాధ్యం?

ఎవరైనా రూ.లక్ష బయట వడ్డీకి ఇస్తే నెలకు రూ.2లకు మించి రాదు. వీళ్లేమో ఏకంగా రూ.4 వడ్డీ ఇస్తామంటూ ఆశ చూపిస్తున్నారు. దీంతో చాలా మంది ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ వడ్డీ చెల్లింపుల మీద అనేక అనుమానాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల మీద ఇంతేసి లాభం వస్తుంటే సొంతంగానే పెట్టుబడులు పెట్టి సంపాదించుకోవచ్చు. ఇదే వ్యాపార సూత్రాన్ని ప్రాజెక్టు రూపంలో బ్యాంకర్లకు సమర్పించి రూపాయి వడ్డీ మించకుండా లోన్లు కూడా తీసుకోవచ్చు. అలా కాకుండా ప్రజల నుంచి పెట్టుబడుల పేరిట వసూలు చేస్తున్న సొమ్ముకు ఇంత వడ్డీ ఎలా చెల్లించగలుగుతారని ప్రశ్నిస్తే తాము సొంతగా వ్యాపారం చేస్తున్నామంటున్నారు.

ఎల్ జీ, సామ్ సాంగ్ ఉత్పత్తులనే ప్రధానంగా చెప్తున్నారు. బిజినెస్ లో లాస్ వస్తే ఎట్లా అని అడిగితే చెల్లింపులకు సేల్స్ తో సంబంధం లేదని, తాము కమిట్మెంట్ ప్రకారమే ఇస్తామంటున్నారు. హెచ్ఎండీఏ, డీటీసీపీ, రెరా అనుమతులు పొందిన రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడి పెడితే అడిగేందుకు అవకాశం ఉంది. కానీ ఎంవోయూలతో ప్రతి నెలా రిటర్న్స్ ఇస్తామంటూ వ్యాపారం చేసే కంపెనీలు మోసం చేస్తే ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్ధితి నెలకొన్నది. బడా సంస్థలు వాళ్లు వ్యాపారం చేసేందుకు అవసరమైన పెట్టుబడి కోసం బ్యాంకులను సంప్రదించకుండా కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేయడంలో ఆంతర్యమేమిటో మున్ముందు అర్థం కానున్నది.

ఇన్వెస్ట్‌మెంట్ కాన్సెప్ట్

సొంతంగా పైసా పెట్టకుండా జనం సొమ్ముతోనే వందల ఎకరాలు కొనుగోలు చేసి బిజినెస్ చేస్తున్నారు. చిట్ ఫండ్స్, ఫైనాన్స్ అనుభవంతో అవే కంపెనీలు కస్టమర్ల నుంచి ఇన్వెస్ట్ మెంట్ రూపంలో రూ.కోట్లు వసూలు చేస్తున్నారు. ఆపార్చునిటీ కాన్సెప్ట్ అంటూ కొత్త వ్యాపారానికి తెర తీశారు. ‘తమ ప్రాజెక్టులో పెట్టుబడి పెడితే ముందే కొంత ల్యాండ్ ని మీ పేరిటే రిజిస్ట్రేషన్ చేస్తాం. ఏడాది, రెండేండ్లల్లోనే ఆ ప్రాజెక్టు పూర్తవుతుంది. అప్పుడు మీరు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ల్యాండ్ ని ప్లాట్ రూపంలో అందజేస్తాం’ అంటూ ఊరిస్తున్నారు. బహిరంగ మార్కెట్ లో రూ.50 లక్షలకు ఎకరం ఉంటే రూ.కోటికి పైగా లెక్కించి కస్టమర్లకు అంటగడుతున్నారు. ఇలాంటి బిజినెస్ చేస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీల్లో అత్యధికం ఫైనాన్స్ సంస్థలే కావడం విశేషం.

సుదీర్ఘ అనుభవం కలిగిన అనేక కంపెనీలు ఈ దందాను జోరుగా నడిపిస్తున్నాయి. అయితే ఆ ల్యాండ్ ని రైతుల నుంచి కొనుగోలు చేయకుండానే మార్కెటింగ్ చేస్తుండడం గమనార్హం. ఇవి రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అధికంగా కనిపిస్తున్నాయి. ఎలాగూ ఫైనాన్స్ కంపెనీల్లో ఉండే కస్టమర్లకే వల విసురుతున్నారు. వారి పరిచయాన్ని వీటికి వాడుకుంటున్నారు. కానీ ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోతే వారి పేరిట రిజిస్టర్డ్ చేసుకున్న భూములకు పెట్టుబడిలో సగం కూడా వచ్చే పరిస్థితి ఉండదు. పైగా ఆ భూమి సరిహద్దులు కూడా కస్టమర్లకు తెలియవు. ఎవరికో ఒకరికి అమ్మేసుకుందామన్నా కుదిరే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో ఇన్వెస్ట్ మెంట్ చేసే ముందే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని రియల్ ఎస్టేట్ నిపుణులు సూచిస్తున్నారు.

గతంలో అనేక మోసాలు..

రియల్ ఎస్టేట్, వ్యాపార, వాణిజ్య రంగాల్లో పెట్టుబడుల పేరిట విభిన్న కోణంలో మార్కెటింగ్స్ సాగుతున్నాయి. రూ.లక్ష పెట్టండి.. 25 నెలల్లో డబుల్ ఇస్తామంటున్నారు. ప్రధానంగా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇలా ఎక్కువగా మార్కెటింగ్ చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్, హోం అప్లయిన్సెస్ షోరూమ్స్ సైతం ఇదే దారిలో వెళ్తున్నాయి. హైదరాబాద్, సంగారెడ్డి, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని ప్రాజెక్టులను చూపించి పెట్టుబడుల రూపేణా కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ఇలా ఒకటీ రెండు కాదు.. పదుల సంఖ్యలో కంపెనీలు కొత్త తరహా ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టులను మార్కెటింగ్ చేస్తున్నాయి. ఇప్పటికే అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రీలాంచ్ ఆఫర్ల పేరిట దందాలు చేసి రూ.వేల కోట్లు ముంచేసి బోర్డులు తిప్పేశాయి. వేలాది మంది బాధితులు కేసులు పెట్టి.. పెట్టుబడి వరకైనా వస్తుందేమోనని ఆశతో ఎదురుచూస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed