బీఆర్‌ఎస్ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

by Vinod kumar |
బీఆర్‌ఎస్ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లోనే రాష్ట్రంలో నకిలీ యూనివర్సిటీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గత తొమ్మిది ఏళ్ళుగా కేసీఆర్ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనమైందని విమర్శించారు. గురునానక్ యూనివర్సిటీలో విద్యార్థులు,మరి తల్లిదండ్రుల ఆందోళన పై స్పందించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. యూనివర్సిటీ ఛాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ అనుమతి లేకుండానే గురునానాక్, శ్రీనిధి, కావేరీ, నిక్ మార్ ఇంజనీరింగ్ కాలేజీలు నకిలీ యూనివర్సిటీల పేరుతో గడిచిన విద్యాసంవత్సరం వేలాది మంది విద్యార్థులకు అడ్మీషన్లు ఇచ్చి ఘోరంగా మోసం చేయడం అన్యాయమన్నారు. ఏ విద్యార్థుల ప్రాణాల త్యాగాలు, పోరాటాల వల్ల ఏర్పడ్డ తెలంగాణలో నేడు విద్యార్థి లోకానికి తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

నకిలీ యూనివర్సిటీలో అడ్మిషన్లు పొందిన వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రో. రవీందర్ గుప్తా లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడంటే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా మారిందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.ఎన్ని కోట్లు కల్వకుంట్ల కుటుంబం చేతులు తాకితే వైస్ ఛాన్సలర్ పోస్టులు వస్తున్నాయో ఇక చెప్పనక్కర్లేదని అన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలియకుండ రాష్ట్రంలో నకిలీ యూనివర్సిటీలు వెలిశాయా? అని ప్రశ్నించారు.

ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఏం చేస్తున్నారని, ఈ ఘటనలో విద్యాశాఖ మంత్రిని మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నకిలీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు ఇచ్చి,విద్యార్థులు వారి తల్లిదండ్రులను మోసం చేసిన యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి, నకిలీ యూనివర్సిటీలను తక్షణమే మూసివేయాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉస్మానియా,కాకతీయ,పాలమూరు, మహాత్మాగాంధీ, తెలంగాణ వంటి అనేక విశ్వవిద్యాలయాలను శిథిలావస్థకు చేర్చి, ప్రయివేట్ యూనివర్సిటీలు,నకిలీ యూనివర్సిటీలకు అనుమతులు ఇచ్చిందని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed