అందుకే బీఆర్ఎస్‌ అధికారం కోల్పోయింది.. కుండబద్దలు కొట్టిన అరికెపూడి గాంధీ

by Gantepaka Srikanth |
అందుకే బీఆర్ఎస్‌ అధికారం కోల్పోయింది.. కుండబద్దలు కొట్టిన అరికెపూడి గాంధీ
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)పై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ(Arikepudi Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో సీనియర్‌పై ఒక జూనియర్ దుర్భాషలాడటం ఏంటని ప్రశ్నించారు. రౌడీలా మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు. రెండ్రోజులుగా జరుగుతున్న పరిస్థితులు ప్రజలు, పోలీసులను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి చీర, గాజులు చూపించి మహిళలను కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఆంధ్రా, తెలంగాణ అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారని అన్నారు. ప్రజల మధ్యన చిచ్చు పెట్టడమే లక్ష్యంగా కౌశిక్ రెడ్డి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. పదేళ్ల పాటు తాను పార్టీలో క్రమశిక్షణ గత ఎమ్మెల్యేగా నడుచుకున్నానని అన్నారు.

కేసీఆర్(KCR) అంటే ఇప్పటికీ గౌరవం ఉందని తెలిపారు. బీఆర్ఎస్‌(BRS)లో ఇప్పుడు చాలా చెదపురుగులు చేరాయి. ఇలాంటి వారి వల్లే పార్టీ అధికారం కోల్పోయిందని అన్నారు. తనను హరీష్ రావు(Harish Rao) భాష మార్చుకోవాలంటున్నారు.. ఒకసారి మీరు ఐపీఎస్‌లపై మాట్లాడిన మాటలు గుర్తుతెచ్చుకోవాలని హితవు పలికారు. మీ భాష కరెక్ట్ అయితే.. నా భాష కూడా కరెక్టే అని అరికెపూడి గాంధీ అన్నారు. కాగా, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డిల సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాష్ట్రంలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ నెలకొంది. నిన్న(గురువారం) అరికెపూడి అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో లోకల్, నాన్ లోకల్ అంటూ కౌశిక్ రెడ్డి కొత్త వివాదానికి తెరలేపాడు. తాజాగా ఈ వివాదంపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మీడియాతో మాట్లాడి పై కామెంట్స్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డిని తక్షణమే BRS పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story