మహిళలకు తెలంగాణ సర్కారు మరో గుడ్ న్యూస్.. రూ.2500 పథకం గైడ్‌లైన్స్ రెడీ

by Rajesh |
మహిళలకు తెలంగాణ సర్కారు మరో గుడ్ న్యూస్.. రూ.2500 పథకం గైడ్‌లైన్స్ రెడీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : గతేడాది అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. ఇప్పటికే కొన్ని అమలు చేస్తుండగా మరికొన్నింటినీ అమలు చేసేందుకు ఆఫీసర్లు విధివిధానాలపై కసరత్తు చేస్తున్నారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో మహిళలకు పెద్దఎత్తున ప్రాధాన్యత కల్పించారు. వీటిలో మహిళల ఖాతాలో ప్రతి నెలా రూ.2,500 జమ చేస్తామని ప్రకటించారు. విశ్వసనీయమైన సమాచారం మేరకు ఈ స్కీంను జూలై నుంచి ప్రారంభించనున్నట్టు తెలిసింది. అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ త్వరలో ఈ స్కీమ్ ప్రారంభిస్తామని పలు సందర్భాల్లో పేర్కొన్న సంగతి విదితమే.

మార్గదర్శకాలు రెడీ

ఈ పథకం అమలుకు సంబంధించి అధికారులు ఇప్పటికే మార్గదర్శకాలను సిద్ధం చేశారు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళా అకౌంట్లో నెలనెలా రూ.2,500 జమ కానున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి పెన్షన్లు పొందని కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే నగదు అందేలా నిబంధనలు తీసుకొస్తున్నట్టు సమాచారం. ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలనుకునే వారికి ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టింది. దరఖాస్తుదారు తెలంగాణ నివాసియై వుండాలి. తప్పనిసరిగా కుటుంబానికి స్త్రీ యాజమని అయి ఉండాలి. అలాగే బీపీఎల్ కుటుంబానికి చెందినవారై ఉండాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా వివాహం చేసుకోవాలి. ఒక కుటుంబం నుంచి ఒక మహిళ మాత్రమే పథకం ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. దరఖాస్తుదారు కుటుంబం సంవత్సరానికి రెండు లక్షల కంటే తక్కువ కుటుంబ ఆదాయం కలిగి ఉండాలి. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటోంది.

ముఖ్యమంత్రి డెసిషన్ కోసం వెయిట్

ఈ స్కీంపై సీఎం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవడమే మిగిలి ఉంది. సమాజంలో మహిళకు సాధికారత, ప్రోత్సాహం అందించడమే ‘మహాలక్ష్మి’ పథకం లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది. స్త్రీని శక్తిమంతం చేయడమే కాకుండా వారిని ఆర్థికంగా స్వతంత్రులను చేయడం ద్వారా వారి జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. మహిళలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు, వారి జీవనశైలిని మెరుగుపరచుకోవడంతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని పొందడం, తద్వారా పేదరికాన్ని తగ్గించొచ్చనే ఆలోచనతో ఈ పథకానికి కాంగ్రెస్ సర్కారు అంకురార్పణ చేసింది.

Advertisement

Next Story