BCCI Digital Rights: బీసీసీఐ డిజిట‌ల్, టీవీ హ‌క్కులు వయాకామ్‌18 చేతికి..

by Vinod kumar |   ( Updated:2023-09-06 06:02:47.0  )
BCCI Digital Rights: బీసీసీఐ డిజిట‌ల్, టీవీ హ‌క్కులు వయాకామ్‌18 చేతికి..
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీసీఐ మీడియా హక్కులను వ్యాపార దిగ్గజం ముకేశ్‌ అంబానీకి చెందిన వయాకామ్‌18 సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ రానున్న ఐదేళ్లలో (2023 సెప్టెంబర్‌ నుంచి 2028 మార్చి) టీమిండియా స్వదేశంలో ఆడే మ్యాచ్‌ల టీవీ ప్రసార హక్కులతో పాటు డిజిటల్‌ రైట్స్‌ను కూడా సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా స్వయంగా ట్విట్టర్‌లో ప్రకటించారు.

"ఐదేళ్ల కాలానికి బీసీసీఐ మీడియా హక్కులను దక్కించుకున్న వయాకామ్ 18కు శుభాకాంక్షలు. ఐపీఎల్​, మహిళల ప్రీమియర్ లీగ్ సెక్టార్​లో ఇండియన్ క్రికెట్ రానున్న రోజుల్లో మరింత​ ఎదుగుతుంది. క్రికెట్ ఫ్యాన్స్​ అంచనాలను అందుకోవడానికి మేం నిరంతరం ప్రయత్నిస్తాం" అని జై షా ట్వీట్ చేశారు. ఇక ప్రసారం చేసిన ప్రతి మ్యాచ్‌కు మీడియా హక్కుల రూపంలో రూ.67.8 కోట్లు అందుకోనుంది.

ఇప్పుడీ మీడియా హక్కులతో వయాకామ్‌ క్రీడా ప్రపంచంలో సరికొత్త రికార్డు సృష్టించినట్లు అయింది. భారత మ్యాచ్‌లతో పాటు, ఐపీఎల్ (డిజిటల్), మహిళా ప్రీమియర్‌ లీగ్ 2024, పారిస్‌ ఒలింపిక్స్‌ 2024, టీ10 లీగ్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లు, దక్షిణాఫ్రికా20 ఫ్రాంచైజీ క్రికెట్‌ లీగ్‌, రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌, ఎన్‌బీఏ, డైమండ్‌ లీగ్‌.. ఇలా ప్రపంచవ్యాప్తంగా గేమ్స్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశం వయాకామ్‌కు వచ్చింది.

భారత క్రికెట్‌ జట్టు స్వదేశంలో ఆడే మ్యాచ్‌లు స్పోర్ట్స్‌ 18 ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుండగా.. ఈ మ్యాచ్‌లు జియో సినిమాలో లైవ్‌ స్ట్రీమింగ్‌ కానున్నాయి. అయితే జియో సినిమా ఇదివరకే ఐపీఎల్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ హక్కులను (ఐపీఎల్‌ డిజిటల్‌ రైట్స్‌) దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ ఐదేళ్లలో భార‌త జ‌ట్టు 88 మ్యాచ్‌లు ఆడ‌నుంది. వీటిలో 25 టెస్టులు, 27 వ‌న్డేలు, 36 టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి.

Advertisement

Next Story