PAK vs ENG : రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించిన పాక్.. నాలుగేళ్ల తర్వాత గెలుపు

by Harish |
PAK vs ENG : రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించిన పాక్.. నాలుగేళ్ల తర్వాత గెలుపు
X

దిశ, స్పోర్ట్స్ : సొంతగడ్డపై పాకిస్తాన్ టెస్టు విజయం నిరీక్షణకు తెరదించింది. కొంతకాలంగా వరుస పరాజయాలతో విమర్శలు ఎదుర్కొంటున్న పాక్ జట్టు ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించి నాలుగేళ్ల తర్వాత సొంతగడ్డపై ఓ టెస్టు విజయాన్ని అందుకుంది. ముల్తాన్ వేదికగా శుక్రవారం ముగిసిన రెండో టెస్టులో పాక్ 152 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.

తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 366 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 291 రన్స్ చేసింది. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో 221 రన్స్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 75 పరుగులు కలుపుకుని ప్రత్యర్థి ముందు 296 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. ఛేదనలో తేలిపోయిన ఇంగ్లాండ్ 144 పరుగులకే కుప్పకూలింది. ఓవర్‌నైట్ స్కోరు 36/2తో శుక్రవారం ఆట కొనసాగించిన ఆ జట్టును పాక్ స్పిన్నర్ నొమన్ అలీ(8/46) బెంబేలెత్తించాడు. 8 వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు.

కెప్టెన్ బెన్ స్టోక్స్(37) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఇంగ్లాండ్ జట్టులో ఏ ఒక్కరూ కనీసం పోరాటం చేయలేకపోయారు. దీంతో నాలుగో రోజే పాక్ విజయం లాంఛనమైంది. పాక్ బౌలర్లలో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి నొమన్ అలీ 11 వికెట్లు తీయగా, సాజిద్ ఖాన్ 9 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌కు ముందు పాక్ వరుసగా 11 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ విజయంతో పాక్ మూడు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ నెల 24 నుంచి 28 వరకు జరిగే మూడో టెస్టులోనే సిరీస్ ఫలితం తేలనుంది.

Advertisement

Next Story

Most Viewed