పాక్‌కు మళ్లీ షాక్.. రెండోది కివీస్‌దే

by Harish |
పాక్‌కు మళ్లీ షాక్.. రెండోది కివీస్‌దే
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 సిరీస్‌లో పాకిస్తాన్‌కు ఆతిథ్య న్యూజిలాండ్ మరోసారి షాకిచ్చింది. ఇప్పటికే తొలి టీ20 నెగ్గిన కివీస్.. ఫిన్ అలెన్(74) సంచలన ఇన్నింగ్స్‌కుతోడు ఆడమ్ మిల్నే(4/33) బంతితో చెలరేగడంతో రెండో మ్యాచ్‌లోనూ పాక్‌ను ఓడించింది. దీంతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. హామిల్టన్ వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లో పాకిస్తాన్‌పై 21 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 194 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. 41 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 74 పరుగులు చేశాడు. ఉసామా మిర్ బౌలింగ్‌లో బౌల్డ్ అవడంతో అతని దూకుడుకు తెరపడింది. ఫిన్ అలెన్ అవుటైన తర్వాత కివీస్ కాస్త తడబడినా.. సాంట్నర్(25), కెప్టెన్ విలియమ్సన్(26) విలువైన పరుగులు జోడించారు. పాక్ బౌలర్లలో హరిస్ రవూఫ్ 3 వికెట్లు, అబ్బాస్ అఫ్రిది 2 వికెట్లతో రాణించారు. భారీ టార్గెట్‌ ఛేదనలో పాకిస్తాన్ 173 పరుగులకే కుప్పకూలింది. ఫకర్ జమాన్(50) విధ్వంసకర ఇన్నింగ్స్‌కుతోడు బాబర్ ఆజామ్(66) రాణించినా పాక్‌కు ఓటమి తప్పలేదు. ఆడమ్ మిల్నే 4 వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించగా.. టిమ్ సౌథీ, బెన్ సియర్స్, ఇష్ సోధి రెండేసి వికెట్లతో సమిష్టిగా రాణించారు. వరుసగా రెండో విజయంతో సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లిన కివీస్ మరో మ్యాచ్ గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది. ఈ నెల 17న మూడో టీ20 జరగనుంది.

Next Story