ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-3లో ఫైనల్‌కు జ్యోతి జట్టు

by Harish |
ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-3లో ఫైనల్‌కు జ్యోతి జట్టు
X

దిశ, స్పోర్ట్స్ : ఆర్చరీ వరల్డ్ కప్‌ టోర్నీల్లో భారత మహిళల కాంపౌండ్ జట్టు దూకుడు కొనసాగుతోంది. గత రెండు దశల్లో స్వర్ణం గెలిచిన తెలుగమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ, ఆదితి స్వామి, పర్ణీత్ కౌర్ త్రయం మరో గోల్డ్ మెడల్‌పై కన్నేసింది. తుర్కియేలో జరుగుతున్న స్టేజ్ 3లో బుధవారం జ్యోతి జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్‌లో భారత జట్టు 235-227 తేడాతో ఎల్ సాల్వడార్ టీమ్‌ను ఓడించింది. ఆ తర్వాత సెమీస్‌లోనూ అదే జోరు ప్రదర్శించింది. ఆతిథ్య జట్టు తుర్కియే‌పై 234-227(59-55, 58-59, 58-56, 59-57) తేడాతో విజయం సాధించింది. రెండో సెట్‌లో మినహా మిగతా మూడు సెట్లలో జ్యోతి జట్టు ఆధిపత్యమే కొనసాగింది. ఈ నెల 22న స్వర్ణ పతకం కోసం భారత త్రయం ఎస్టోనియాతో తలపడనుంది. మరోవైపు, పురుషుల కాంపౌండ్ జట్టు పతకం లేకుండానే ఇంటిదారిపట్టనుంది. బ్రాంజ్ మెడల్‌ మ్యాచ్‌లో ప్రియాన్షు, అభిషేక్ వర్మ, ప్రథమేశ్‌లతో కూడిన భారత జట్టు 235-236 తేడాతో ఫ్రాన్స్ చేతిలో ఓడి తృటిలో కాంస్య పతకాన్ని కోల్పోయింది.

Advertisement

Next Story