కుంబీ కుల ధృవీకరణ పత్రాలను అందజేయనున్న మహారాష్ట్ర ప్రభుత్వం!

by Harish |
కుంబీ కుల ధృవీకరణ పత్రాలను అందజేయనున్న మహారాష్ట్ర ప్రభుత్వం!
X

ముంబై: కుంబీ కుల ధృవీకరణ పత్రాల కోసం మరాఠా కమ్యూనిటీ దీర్ఘకాల డిమాండ్‌పై చర్యలు ప్రారంభిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ నిర్ణయంతో కుంబీ కులస్థులు ఓబీసీ కేటగిరీలో రిజర్వేషన్‌కు అర్హులు అవుతారు. ఈ క్రమంలోనే రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తి సందీప్‌ షిండే నేతృత్వంలోని కమిటీ తొలి నివేదికను ప్రభుత్వం ఆమోదించినట్టు తెలుస్తోంది. ఈ కమిటీని మరాఠ్వాడా ప్రాంతంలోని మరాఠాలకు ప్రత్యేకంగా కుంబీ కుల ధృవీకరణ పత్రాలను మంజూరు చేసేందుకు ఏర్పాటు చేశారు.

మరాఠా కమ్యూనిటీ హక్కుల కోసం కొనసాగుతున్న డిమాండ్‌లో కీలకమైన పరిణామాన్ని సూచిస్తూ కుంబీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభమైందని అధికారిక ప్రకటన వెలువడింది. మంగళవారం ఈ డిమాండ్‌కు సంబంధించి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అనేక హింసాత్మక సంఘటనలు కూడా చెలరేగాయి.

కాగా, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో, మరాఠా కమ్యూనిటీ విద్యా, సామాజిక వెనుకబాటును అంచనా వేయడానికి ఓబీసీ కమిషన్ తాజా డేటాను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ డేటా మారాఠా కమ్యూనిటీ రిజర్వేషన్ విధానాలు, నిబంధనలకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

Advertisement

Next Story