జమ్మూ కశ్మీర్‌ ఎన్నికల్లో రిగ్గింగ్: పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ నిరసన

by samatah |
జమ్మూ కశ్మీర్‌ ఎన్నికల్లో రిగ్గింగ్: పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ నిరసన
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆరో దశ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఏడు రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలోని 58 స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అయితే జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానం నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన మెహబూబా ముఫ్తీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ..పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి నిరసనకు దిగారు. తన పార్టీ కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్లను ఏ కారణం లేకుండా పోలీసు స్టేషన్లలో నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు. అంతేగాక తన మొబైల్ ఫోన్‌లో అవుట్‌గోయింగ్ కాల్స్ నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అనంత్ నాగ్-రాజౌరీ సెగ్మెంట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈవీఎంల ట్యాంపరింగ్‌కు సంబంధించి ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. అంతకుముందు పీడీపీ కార్యకర్తలను, పోలింగ్ ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ముఫ్తీ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. మరోవైపు ఉదయం 9 గంటల వరకు 10.82 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 16.54శాతం, అత్యల్పంగా ఒడిశాలో 7.43శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్ర పతి జగదీప్ ధన్ ఖడ్, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.



Next Story