ఇండియాలో వెల్లువెత్తిన మతసామరస్యం

by John Kora |
ఇండియాలో వెల్లువెత్తిన మతసామరస్యం
X

- ఒకే రోజు హోలీ, రంజాన్ ప్రార్థనలు

- ప్రశాంతంగా గడిచిన శుక్రవారం

- భారీగా పోలీసుల మోహరింపు

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు మిన్నంటాయి. అదే సమయంలో ముస్లింల పవిత్ర రంజాన్ మాసంలోని రెండో శుక్రవారం ప్రార్థనలు కూడా అత్యంత భక్తి శ్రద్దలతో చేసుకున్నారు. దేశంలోని రెండు ముఖ్యమైన మతాలకు సంబంధించిన పవిత్రమైన రోజు కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుకుండా ముందస్తు జాగ్రత్తలు చేసుకున్నారు. అయితే ప్రజలు ఏ మాత్రం వివాదాలకు తావివ్వకుండా మతసామరస్యంతో శాంతియుతంగా ప్రార్థనలు, పూజలు, సంబరాలు నిర్వహించారు. అనేక రాష్ట్రాల్లో పెట్రోలింగ్, పికెటింగ్‌తో సహా భద్రతను కట్టుదిట్టం చేశారు.

దేశ రాజధాని ఢిల్లీలో 25,0000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. పోలీసులు సీసీ టీవీ కెమేరాలు, డ్రోన్లలతో అత్యంత సున్నితమైన 300 ప్రాంతాలను గస్తీ కాశారు. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు గాను.. పోలీసు సిబ్బంది ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేవారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని తనిఖీ చేయడానికి ప్రధాన కూడళ్లలో ప్రత్యేక బృందాలను నియమించారు. గతేడాది యూపీలోని సంభాల్‌లో జామా మసీదు సర్వే తర్వాత నవంబర్ 24న అల్లర్లు చెలరేగాయి. దీంతో ఈ సారి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హోలీ నాడు సంభాల్ నగరంలో సాంప్రదాయంగా నిర్వహించే చౌపాయి కా జూలూస్ ఊరేగింపును కూడా ప్రశాంతంగా నిర్వహించారు. అదే సమయంలో మధ్యాహ్నం మసీదులో ప్రార్థనలు జరిగాయి.

పశ్చిమ బెంగాళ్‌లో హోలీ నాడు దోల్‌జాత్రాను జరుపుకుంటారు. ఈ సందర్భంగా సీఎం మమత బెనర్జీ పౌరుల మధ్య బంధం మరింతగా బలపడాలని ప్రార్థించారు. గోవాలో స్థానికులతో పాటు దేశ, విదేశీ యాత్రికులతో హోలీ పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి. పానాజీలోని ఆజాద్ మైదానంలో వేలాది మంది ఆనందోత్సాహాలతో హోలీ జరుపుకున్నారు.అస్సాంలో హోలీతో పాటు దౌల్ ఉత్సవ్ నిర్వహించారు. హర్యానా, పంజాబ్‌లలో గులాల్, స్వీట్లతో హోలీ సంబరాలు చేసుకున్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో శ్రీ దుర్గియానా ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆనంద్‌పూర్ సాహిబ్‌లో జరిగే హెల్లా మొహల్లా పండుగకు కూడా సిక్కు భక్తుల తాకిడితో సంబరంగా మారింది.

హైదరాబాద్‌లోని ఉత్తరాదీ భారత సంఘాలు 'హోలికా దహన్' నిర్వహించారు. ఈ సందర్భంగా రాజస్థాన్‌కు చెందిన శక్తివంతమైన జానపద నృత్యం గైర్‌ను కూడా ప్రదర్శించారు. మొత్తంగా అన్ని రాష్ట్రాల్లో హోలీ పండుగ, శుక్రవారం ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి.

Next Story

Most Viewed