జమ్మూ కశ్మీర్, హర్యాలో ఎగ్జిట్ పోల్స్.. ప్రతిపక్ష నాయకుడి హోదాలో రాహుల్ కు బిగ్ రిలీఫ్

by Prasad Jukanti |
జమ్మూ కశ్మీర్, హర్యాలో ఎగ్జిట్ పోల్స్.. ప్రతిపక్ష నాయకుడి హోదాలో రాహుల్ కు బిగ్ రిలీఫ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల అనంతరం జరిగిన జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీకి ఎదురుదెబ్బ తగలనున్నదని సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఇవాళ హర్యానాలో పోలింగ్ ముగిసిన తర్వాత విడుదలైన సర్వే ఫలితాల్లో ఇండియా కూటమికి అద్భుత ఫలితాలు వస్తాయని పేర్కొన్నాయి. 90 స్థానాలున్న హర్యానాలో హస్తం కూటమికి 49 నుంచి 61 స్థానాలు దక్కుతాయని, బీజేపీకి 20-32 సీట్లకే పరిమితం అవుతుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే వెల్లడించింది. ఇక జేజేపీ ఒక్క సీటు గెలుచుకోవడమే కష్టమని పేర్కొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాలోని మొత్తం 90 సీట్లలో బీజేపీ 40 కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 31 స్థానాలు, జేజేపీ 10 సీట్లను గెలుచుకున్నాయి. జేజేపీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రెండు పర్యాయాలు ఇక్కడ బీజేపీ అధికారంలో ఉన్నది. ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హర్యానాలోని పది స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లో ఐదేసీ స్థానాలను గెలుచుకున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఊరటనిచ్చింది. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీకి అవకాశం ఇచ్చింది. కశ్మీర్, హర్యానాలో కాంగ్రెస్ అధికారం ఏర్పాటు చేస్తే అపోజిషన్ లీడర్ హోదాలో రాహుల్ గాంధీ మైలేజ్ కు మరింత సానుకూల అంశంగా మారే అవకాశం ఉంది. ఇదే జోష్ తో రాబోయే మహారాష్ట్ర ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ముందుకు పోయే అవకాశాలు ఉంటాయనే టాక్ వినిపిస్తోంది.

జమ్మూకశ్మీర్‌లో ‘ఇండియా’!

జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నిక్లలో హంగ్ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పీపుల్స్ ప‌ల్స్‌-సౌత్‌ఫ‌స్ట్‌ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా తొలగింపు తర్వాత తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వినూత్నమైన తీర్పు ఇవ్వబోతున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. జమ్మూకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో జరిగిన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి అవసరమైన 46 స్థానాల మెజార్టీ స్థానాలు వచ్చే అవకాశాలు లేవని పేర్కొంది. ఇక్కడ కలిసి పోటీ చేసిన నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ పార్టీల కూటమికి వచ్చే సీట్లతో ఆ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు వెల్లడించింది. 33-35 సీట్లతో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని, బీజేపీ 23-27, కాంగ్రెస్ 13-15, పీడీపీ 7-11, ఏఐపీ 0-1, ఇతరులు 4-5 సీట్లు గెలుపొందే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఈ సర్వే ఫలితాల్లో మూడు శాతం ప్లస్ ఆర్ మైనస్ మార్జిన్ ఉండే అవకాశాలున్నాయని సర్వే సంస్థ వెల్లడించింది. అయితే, ఈ నెల 8వ తేదీన ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

హర్యానా:

సర్వే సంస్థ బీజేపీ కాంగ్రెస్ జేజేపీ ఇతరులు

పీపుల్స్ పల్స్ 20-32 49-61 2-3 3-8

దైనిక్ భాస్కర్ 15-29 44-54 0-1 4-15

ధ్రువ్ రీసెర్చ్ 22-32 50-64 2-3 2-8

మాట్రిజ్ 8-24 55-62 0-3 3-11

జమ్మూకశ్మీర్:

సర్వే సంస్థ బీజేపీ కాంగ్రెస్+ఎన్సీ పీడీపీ ఇతరులు

పీపుల్స్ పల్స్ 23-27 46-50 7-11 4-6

సీ ఓటర్ 27-32 42-48 6-12 6-11

దైనిక్ భాస్కర్ 20-25 35-40 4-7 12-16

Advertisement

Next Story