Amith shah: నక్సల్స్ రహిత భారత్ దిశగా మరో అడుగు.. ఎన్‌కౌంటర్లపై కేంద్ర మంత్రి అమిత్ షా

by vinod kumar |
Amith shah: నక్సల్స్ రహిత భారత్ దిశగా మరో అడుగు.. ఎన్‌కౌంటర్లపై కేంద్ర మంత్రి అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గడ్‌ అడవులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లాయి. బస్తర్ ప్రాంతంలోని బీజాపూర్ (Bijapur), కాంకేర్ (Kanker) జిల్లాల్లో గురువారం జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు హతమయ్యారు. అలాగే నక్సలైట్ల ఎదురు కాల్పుల్లో డిస్టిక్ రిజర్వ్ గార్డ్ (DRG)కు చెందిన ఓ జవాన్ సైతం ప్రాణాలు కోల్పోయాడు. బీజాపూర్‌లో 26 మంది, కాంకేర్‌లో నలుగురు నక్సలైట్లు మరణించినట్టు అధికారులు తెలిపారు. బీజాపూర్, దంతెవాడ సరిహద్దులోని గంగళూరు పోలీస్ స్టేషన్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే ఇంటలిజెన్స్ సమాచారం మేరకు భద్రతా బలగాలు ఉదయం 7 గంటల సమయంలో ఆ ప్లేసులో కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దీంతో 26 మంది మావోయిస్టులతో పాటు ఓ జవాన్ మరణించాడు. అలాగే కాంకేర్‌ జిల్లాలోని కొరోస్కోడో గ్రామ సమీపంలో బార్డర్ సెక్యురిటీ ఫోర్స్(BSF), జిల్లా రిజర్వ్ గార్డ్ సంయుక్తంగా జరిపిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులను హతమార్చాయి.

ఘటనా స్థలం నుంచి తుపాకులు, పేలుడు పదార్థాలతో పాటు 26 మంది నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు బస్తర్ రేంజ్ఐజీ సుందర్ రాజ్ (Sunderraj) తెలిపారు. డీఆర్‌జీ జవాన్ సైతం మృతి చెందినట్టు ధ్రువీకరించారు. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలతో కూడిన సంయుక్త బృందం ఈ ఆపరేషన్ చేపట్టినట్టు వెల్లడించారు. ప్రస్తుతం రెండు ప్రాంతాల్లోనూ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. మావోయిస్టుల మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, తాజా ఘటనతో కలిపి ఈ ఏడాది రాష్ట్రంలో జరిగిన ఎన్ కౌంటర్లలో 113 మంది నక్సలైట్లు హతమయ్యారు. వారిలో 97 మంది కేవలం బీజాపూర్ లోనే మరణించారు. మిగతా వార కాంకేర్ సహా ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ లో మృతి చెందారు.

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) స్పందించారు. ‘నక్సల్ ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా భద్రతా దళాలు భారీ విజయాన్ని సాధించాయని కొనియాడారు. ‘ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీగా నక్సలైట్లు హతమయ్యారు. మోడీ ప్రభుత్వం మావోయిస్టులపై క్రూరమైన వైఖరితో ముందుకు సాగుతోంది. అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ లొంగిపోని నక్సలైట్లపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోంది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నక్సల్ రహితంగా మారనుంది’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Next Story

Most Viewed