మానవ రక్తంలో మొద‌టిసారి మైక్రోప్లాస్టిక్స్ గుర్తింపు, ఆందోళ‌న‌లో పరిశోధకులు!!

by Sumithra |
మానవ రక్తంలో మొద‌టిసారి మైక్రోప్లాస్టిక్స్ గుర్తింపు, ఆందోళ‌న‌లో పరిశోధకులు!!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ప్లాస్టీక్ కాలుష్యం చివ‌రి ద‌శ‌కు చేరుకుందేమో. ఇప్ప‌టి వ‌రకూ ప్లాస్టీక్ భూమిని పొల్యూట్ చేస్తూ, జీవ‌రాసుల్ని బ‌లితీసుకుంటుంద‌ని అనుకున్నాము. చివ‌రిక‌ది మ‌నిషి ర‌క్తంలోకి చేరుకుంది. అవును.. నమ్మి, వాస్త‌వాన్ని గ్ర‌హించాల్సిన తుది ద‌శ ఇదని మ‌న‌కు గుర్తుచేస్తోంది. మైక్రోప్లాస్టిక్ అని పిలువబడే ప్లాస్టిక్ చిన్నచిన్న‌ కణాలే ఈ కాలుష్యానికి ప్రధాన మూలకాలు. వీటిని మొట్ట‌మొదటిసారి మానవ రక్తంలో కనుగొన్నారు. ఒక‌రిద్ద‌రి ర‌క్తంలో కాదు, నెదర్లాండ్స్‌కు చెందిన పరిశోధకుల బృందం పరీక్షించిన దాదాపు 80% శాంపిల్స్‌లో మైక్రోప్లాస్టీక్ ఉండ‌టం ఆందోళ‌న‌ను క‌లిగిస్తోంది. ఈ మైక్రోప్లాస్టిక్ ర‌క్తంతో పాటు శరీరమంతా వ్యాపిస్తుంది. అవయవాల్లో ఉండిపోయి క్యాన్స‌ర్ మాత్ర‌మే కాదు, ర‌క‌ర‌కాల కొత్త వ్యాధుల‌కు కార‌ణం కావ‌చ్చ‌ని, అదే గుండెలోకి చేరితే ఎలాంటి ప‌రిణామాలు ఉంటాయో కూడా చెప్ప‌లేమ‌ని ప‌రిశోధ‌కులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌నుషుల‌ ఆరోగ్యంపై ఈ కణాల దీర్ఘకాలిక ప్రభావం గురించి శాస్త్రవేత్తలకు ఇంకా తెలియరాలేదు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పెరుగుతున్న కాలుష్య స్థాయిల కారణంగా ఈ ప‌రిణామం ఇంకెంత దారుణానికి దారితీస్తుందో తెలియ‌దంటున్నారు.

జర్నల్ ఎన్విరాన్‌మెంట్ ఇంటర్నేషనల్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం, పరిశోధకులు 22 మంది అనామక దాతల నుండి రక్త నమూనాలను విశ్లేషించారు. వారిలో 17 మందిలో మైక్రోప్లాస్టిక్ ఉన్నట్లు కనుగొన్నారు. ర‌క్త న‌మూనాల్లో 0.2 అంగుళం (5 మిమీ) కంటే తక్కువ వ్యాసం కలిగిన చిన్న ప్లాస్టిక్ ముక్కలు ఉన్నాయి. ఈ నమూనాల్లో సగం డ్రింక్‌ బాటిళ్లను తయారు చేయడానికి ఉపయోగించే PET (పాలిథిలిన్ టెరెఫ్తాలేట్) ఉంది. అలాగే, ఫుడ్ ప్యాకేజింగ్‌లో విస్తృతంగా ఉపయోగించే పాలీస్టైరిన్ 36%, ప్యాకేజింగ్ ఫిల్మ్‌లు, బ్యాగ్‌లలో ఉపయోగించే పాలిథిలిన్ 23% శాంపిల్స్‌లో కనుగొన్న‌ట్లు పరిశోధనలో తేలింది. ప్రతి మిల్లీ లీటర్ రక్తంలో 1.6 మైక్రోగ్రాములు (గ్రామ్‌లో 1.6 మిలియన్ల వంతు) ఉంటే అది ప్రమాదానికి దారితీస్తుంద‌ని ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు. ఇది "ఆందోళన చెందాల్సిన విష‌య‌మే" అని నెదర్లాండ్స్‌లోని వ్రిజే యూనివర్సిటీ, ఆమ్‌స్టర్‌డామ్‌లోని ఎకోటాక్సికాలజిస్ట్, అధ్యయన ప్రధాన రచయిత ప్రొఫెసర్ డిక్ వెథాక్ తెలిపారు.

పరిశోధకుల ప్రకారం, ప్లాస్టిక్ కణాలు గాలి, ఆహారం, పానీయాల ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తాయి. గతేడాది జనవరిలో గోవాలోని సాల్ ఈస్ట్యూరీ నుంచి చేపలు, ఇతర సముద్ర ఆహారాల నమూనాల్లో మైక్రోప్లాస్టిక్‌లు కనిపించాయి. గ‌త‌ పరిశోధనల్లో మెదడు, గట్, పుట్టబోయే బిడ్డల ప్లాసెంటాలో మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నాయని కనుగొన్నారు. కానీ మానవ రక్త నమూనాలో క‌నుగొన‌డం ఇదే మొద‌టిసార‌ని చెప్పారు. ఇక‌నైనా, ప్లాస్టీక్ వాడ‌కంపై ప్ర‌పంచ దేశాలు నియంత్ర‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హెచ్చ‌రించారు.

Advertisement

Next Story