ఆస్తులను కాపాడుకోవ‌డానికే బీజేపీలోకి ఈట‌ల‌

by Shyam |
ex deputy cm kadiyam srihari
X

దిశ ప్రతినిధి, వరంగ‌ల్ : మాజీమంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కేవ‌లం త‌న ఆస్తుల‌ను కాపాడుకోవ‌డం కోస‌మే బీజేపీలో చేరార‌ని మాజీ ఉప‌ముఖ్యమంత్రి క‌డియం శ్రీహ‌రి అన్నారు. సోమవారం హ‌న్మకొండ‌లోని హ‌రిత‌హోట‌ల్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో క‌డియం శ్రీహరి మాట్లాడారు. ఈటల బీజేపీలో చేరడమ‌న్నది ఆయ‌న వ్యక్తిగ‌త‌మైన అంశ‌మ‌న్నారు. అయితే వామ‌ప‌క్షవాదిగా చెప్పుకున్న ఆయ‌న ఆ సిద్ధాంతాల‌కు వ్యతిరేకంగా ఎందుకు బీజేపీ పార్టీలో చేరారంటూ ప్రశ్నించారు. ఈటలలో ఉన్న కమ్యూనిస్టు చనిపోయాడా…? ఏమి ఉద్ధరించడానికి బీజేపీలో చేరారని కడియం సూటిగా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌పై వాడిన భాష సరిగా లేదన్నారు. వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్న ఈటల ఫ్యూడల్ వ్యవస్థ గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఐదేళ్ల క్రితమే సీఎంతో మనస్పర్థలు వస్తే ఇప్పుడు ఆత్మాభిమానం గుర్తుకు వచ్చిందా? అంటూ నిల‌దీశారు.

బీజేపీ జాతీయ‌ అధ్యక్షుడు కాకుండా కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మరో వ్యక్తి సమక్షంలో బీజేపీలో చేరడమేటంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణకు బీజేపీ ఏమిచ్చిందని కడియం ప్రశ్నించారు. పేద ప్రజల ఆహార అలవాట్ల మీద కూడా బీజేపీ దాడి చేసిందని, అది తెలిసి కూడా బీజేపీలో ఎలా చేరారని మండిపడ్డారు. ఈటల రాజేందర్ దేనికోసం బీజేపీలో చేరారో ప్రజ‌ల‌కు స్పష్టం చేయాలని క‌డియం డిమాండ్ చేశారు. రాష్ట్ర విభ‌జ‌న అంశాల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం ప్ర‌భుత్వం దృష్టి సారించ‌కుండా మొండి వైఖ‌రిని అవ‌లంభిస్తోంద‌ని అన్నారు. పేద ప్రజల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క మంచి పథ‌కం ప్రారంభించింది లేద‌ని దుయ్యబ‌ట్టారు. బీజేపీలో ప్ర‌జాస్వామ్యం ఉండ‌ద‌ని, అలాంటి పార్టీలోకి ఈట‌ల వెళ్లి చేర‌డం అవివేక‌మ‌న్నారు.

Advertisement

Next Story

Most Viewed