వెంటనే బకాయిలు చెల్లించండి!

by Harish |
వెంటనే బకాయిలు చెల్లించండి!
X

సర్దుబాటు చేసిన స్థూల రాబడి(ఏజీఆర్) బకాయిలను తొందరగా చెల్లించాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించినట్టు కేంద్రం టెలికాం సంస్థలకు తెలిపింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు ఇతర కంపెనీలకు టెలికాం శాఖ లేఖ రాసినట్టు సంబంధిత అధికారులు చెప్పారు. ఎటువంటి ఆలస్యం చేయకుండా మిగిలిన బకాయిలను వెంటనే చెల్లించడమే కాకుండా, స్వీయ మదింపు లెక్కలను కూడా ఇవ్వాలని టెలికాం శాఖ సూచించింది. ఏజీఆర్‌కు అనుగుణంగా టెలికాం గణాంకాల ప్రకారం స్పెక్ట్రమ్ ఛార్జీలు, లసెన్స్ ఫీజు కింద టెలికాం సంస్థలు మొత్తం రూ. 1.47 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే, స్వీయ మదింపు ప్రకారం టెలికాం శాఖ చెప్పిన దానికంటే తాము చెల్లించాల్సింది తక్కువే ఉందని కంపెనీలు చెప్తున్నాయి. ఇప్పటిదాకా అన్ని కంపెనీలు కలిపి రూ. 26,000 కోట్లు మాత్రమే చెల్లించాయి.

అయితే, ఏజీఆర్ బకాయిల నుంచి టెలికాంయేతర ప్రభుత్వ రంగ సంస్థలను అత్యున్నత న్యాయస్థానం మినహాయించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే పార్లమెంట్‌లో వెల్లడించారు. తమకు తగిన వేదికల నుంచి పరిష్కరించుకోవాలని కోర్టు చెప్పినట్లు లిఖితపూర్వక సమాధానంలో మంత్రి తెలియజేశారు. సొంత అవసరాల నిమిత్తం తీసుకున్న స్పెక్ట్రమ్ నుంచి థర్డ్ పార్టీలకు ఇచ్చి ఆదాయం అందుకున్నాయనే ఉద్దేశ్యంతో గెయిల్‌తో పాటు ఇతర ప్రభుత్వ సంస్థలు ఏజీఆర్ పరంగా రూ. 2.7 లక్షలు చెల్లించాలని టెలికాం విభాగం గతంలో ఆదేశించింది. అయితే, టెలికాం వ్యాపారంలో ఆయా ప్రభుత్వ రంగ కంపెనీలు లేమంటూ దీనిపై సవాలు చేయడంతో సుప్రీం కోర్టు కేసు నుంచి వాటికి మినహాయింపు ఇచ్చింది.

Tags: AGR, Telecom Industry, Vodafone Idea, Bharti Airtel

Advertisement

Next Story

Most Viewed