ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

by Anukaran |
ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులలో ఆయన ఒకరు. ఉద్యమ ప్రస్థానం నుంచి అధినేత వెంటే ఉంటూ వస్తున్నారు. తొలిసారి ప్రభుత్వం చేపట్టినప్పుడు కీలకమైన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన నోటి నుంచి మాటల తూటాలు పేలుతున్నాయి. వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తాజాగా మరోసారి చర్చకు తెరలేపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు లబ్ధిదారుల్లో కొంత మందిని తొలగించాలని రైతులు తన దృష్టికి తీసుకొచ్చారని సభలోనే ప్రకటించారు. ఈసారి కొనుగోలు కేంద్రాలు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పర్చేజింగ్ సెంటర్లు ఉండి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో మరోసారి ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

నాడు అలా..

2018లో టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఇద్దరు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుందా అన్న ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగింది. ఇదే సమయంలో ఈటలకు అవకాశం ఉండదన్న ప్రచారం కూడా జరిగింది. ఆయన ముందు కూడా ఈ ప్రతిపాదన పెట్టినప్పటికీ ఆయన ససేమిరా అన్నారని సమాచారం. బోయినపల్లి వినోద్ కుమార్ ద్వారా కూడా అధిష్ఠానం రాయబారం నడిపించి ఈటలను ఒప్పించే ప్రయత్నం కూడా చేశారన్న వ్యాఖ్యలు వెలువడ్డాయి.

అయితే ఆయన మాత్రం ససేమిరా అన్నారని తనకు గతంలో ఇచ్చిన ఆర్థిక శాఖ లేకుంటే మరో కీలక శాఖే అప్పజెప్పాలని పట్టుబట్టారని కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో హుజురాబాద్ సభలో ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. టీఆర్ఎస్ జెండాకు ఓనర్లం మేం అంటూ కామెంట్ చేశారు. నిన్నమొన్న పార్టీలోకి వచ్చిన వారు.. అంటూ కూడా వ్యాఖ్యానించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్టేట్‌మెంట్ దుమారాన్నే లేపింది. చివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటలతో మాట్లాడాల్సిన పరిస్థితి కూడా ఎదురైంది. ఆ తరువాత కేబినెట్ విస్తరణలో ఈటలకు వైద్యారోగ్య శాఖను కట్టబెట్టారు.

నేడు ఇలా..

రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమని, కేటీఆర్ సింహాసనం అధిష్టించేందుకు అధినేత సిద్ధమవుతున్నారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ముహూర్తం ఖరారు చేయడంతో పాటు కేటీఆర్‌కు అనుకూలమైన వాతావరణం కల్పించే విధంగా అధిష్ఠానం చర్యలు సాగుతున్నాయని కూడా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి రాజేందర్ మరోసారి చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు దారి తీస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేది లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మంత్రి ఈటల మాత్రం ‘బాజాప్తాగా చెప్తున్నా.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిందే’నని స్పష్టం చేశారు.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతాంగానికి ఈటల రాజేందర్ తన మద్దతు ప్రకటించారు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ పార్టీ కాని ఈ ఆందోళన గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ ఈటల మాత్రం తన వైఖరిని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో ఇన్‌కంట్యాక్స్ చెల్లించే వారికి, రియల్టర్లకు, లీజుకు ఇచ్చిన వారికి, గుట్టలున్న భూములకు కూడా రైతుబంధు పథకం అమలు చేస్తున్నారని ఈ స్కీమ్ నుంచి వీరిని తొలగించాలని సీఎంను కోరుతానని ప్రకటించారు.

స్థానిక రైతులు ఇలా ఈప్రతిపాదన తీసుకొచ్చారని కూడా చెప్పిన ఈటల ఈ విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని బహిరంగ సభలో ప్రకటించడం వెనక ఆంతర్యం ఏంటన్న చర్చ సాగుతోంది. పార్టీలో అత్యంత సీనియర్ నేతగా ఎదిగిన ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఉన్నట్టుండి మరో బాంబు పేల్చారా.. లేక యాధృచ్ఛికంగానే అన్నారా అనే తర్జన భర్జన కొనసాగుతోంది.

Next Story

Most Viewed