కులగణన దేశ ప్రగతికి దిక్సూచి!

by Ravi |   ( Updated:2024-07-28 01:15:08.0  )
కులగణన దేశ ప్రగతికి దిక్సూచి!
X

అనేక గణాంక వివరాల ప్రకారం, కుల సంఘాల ప్రకారం, దేశంలో 80 శాతం జనాభా ప్రభుత్వ రాయితీలతో అభివృద్ధిలోకి రావాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. లోపభూయిష్టమైన వృద్ధి ఫలితం ఇది. ప్రభుత్వ ఉద్యోగాలు గణనీయంగా తగ్గిపోయాయి. పేదరికం పెరిగిపోయింది. కులాల గణాంకాలు లేకపోతే పేదరికం నిరుద్యోగున్ని అంచనా వేయలేము. చక్రవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడి లాగా ప్రభుత్వం గతి ఇటు రాజ్యాంగం అటు ప్రజాస్వామ్యం వైఫల్యంతో దేశంలో 80 శాతం మంది తమను ఆదుకోవాలని అంటున్నారు. ప్రజల్లో ఈ దుస్థితి మార్చాలి.

దేశ జనాభా ప్రస్తుతం 144 కోట్లకు చేరుకుంది. వీరి లో 11 శాతం ప్రజలు అంటే, 16 కోట్ల మంది ప్రజలు పేదరికంలో ఉన్నారని ఒక అంచనా. అయితే మన స్థూల జాతీయోత్పత్తి ప్రకారం తలసరి ఆదాయం 2400 డాలర్లు. అంటే సుమారు రెండు లక్షల రూపాయలు. ఆ మేరకు అందరూ దేశంలో ఆదాయాలు పొందడం లేదు. అందుకే 80 కోట్ల మందికి ఉచితంగా ఐదు కిలోల బియ్యం ఇస్తున్నాం.అయితే వారందరూ పేదలేనా? పేదరికం గురించి మాట్లాడే వారే లేరు, పేదరికపు లెక్కలు అసలే లేవు. దేశంలో ఒకే ఒక శాతం ఉన్నత ఆదాయ వర్గాల వారి దగ్గర 40% పైగా దేశ సంపద ఉందని మరొక అంచనా.

పేదరికం, నిరుద్యోగం ఎవరి సొత్తు?

OXFAM నివేదిక ప్రకారమైతే.. ఉన్నత ఆదాయ వర్గాలకు చెందిన 10 శాతం జనాభా దగ్గర 77% జాతీయ సంపద ఉన్నది. ఆదాయాలు అందరికీ సమానంగా అందడం లేదు. పెరుగుతున్న ఆదాయాలను పేదలు పొందలేకపోతున్నారు. ఇలా ఆదాయ అసమానతులతో పేదరికంతో నిరుద్యోగంతో ఉన్నది ఎవరు? వెనుకబడిన కులాలే కదా. వారి ఆర్థిక పరిస్థితులు తెలుసుకోవాలంటే కులగణన అవసరమే కదా! లేకపోతే ఆదాయ అసమానతలు పేదరికాన్ని ఎలా తొలగించగలము. అనేక గణాంక వివరాల ప్రకారం, కుల సంఘాల ప్రకారం దేశంలో 80 శాతం జనాభా ప్రభుత్వ రాయతీలతో అభివృద్ధిలోకి రావాలని తాపత్రయపడుతున్నారు. లోపభూయిష్టమైన వృద్ధి ఫలితం ఇది. ప్రభుత్వ ఉద్యోగాలు గణనీయంగా తగ్గిపోయాయి పేదరికం పెరిగిపోయింది.

కులగణనను ఇక వ్యతిరేకించలేరు..

కులాల గణాంకాలు లేకపోతే పేదరికం, నిరుద్యోగులను అంచనా వేయలేము. కులం వర్గం ఒకటిగా ఉన్న మన సమాజాన్ని సమసమాజంగా ఎలా మార్చేది నిలువునా చీలిన సమాజాన్ని సమాంతర పరిచేదెవరు? కులాల సామాజిక ఆర్థిక స్థితిగతులు తెలియకుంటే ప్రభుత్వాలు చేపట్టే పథకాలు ఉపాధి అవకాశాలు ఎలా పేదలకు చేరుతాయి? ఇంతకీ కులగణన వలన జరిగే లాభాలేమిటి? కులగణన వలన మాత్రమే ఓబీసీ కులాలకు సమా నత్వం, సామాజిక న్యాయం, సాధ్యమవుతాయా? అంటే వారి సామాజిక విద్యా ఆర్థిక వెనుకబాటుతనం కులగణన వల్ల తేటతెల్లమవుతుంది కాబట్టి, దానికి అనుగుణంగా ప్రణాళికలు రచించి వారి అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేయడానికి వీలు ఏర్పడుతుంది. కులగణన ఈ దేశానికి ఒక దిశా నిర్దేశం చేస్తుంది. దేశ ప్రగతికి దిక్సూచిగా మారు తుంది. సామాజిక న్యాయానికి బాటలు వేస్తుంది.

రాజ్యం అంటే ఏమిటి?

వెల్ఫేర్ స్టేట్ అంటే సంక్షేమరాజ్యమా? పోలీస్ స్టేట్ అంటే పోలీస్ రాజ్యమా? పాలన అంటే నలుగురు వ్యాపారస్తులు లేదా పెట్టుబడిదారుల ఆర్థిక సహాయంతో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎన్నికల్లో గెలిచి పాలించడం, రాజ్యంలో పెట్టుబడులు లేదా వనరులు సింహ భాగాన్ని తమకు ఆర్థికంగా సహాయం చేసిన పెట్టుబడిదారులకు అప్పనంగా అప్పగించడమా? పెట్టుబడుల మార్కెట్లో ప్రభుత్వం లేదా రాజ్య వ్యవస్థ జోక్యం ఎలా ఉండాలనే దానిపై శతాబ్దాలుగా కచ్చితమైన అభిప్రాయాలను ఆర్థిక శాస్త్రవేత్తలు తెలియజేశారు. క్రీస్తు శకం 18, 19 శతాబ్దాలలో ఆర్థికవ్యవస్థలో రాజ్యం జోక్యం చేసుకోకూడదని, పోలీసు, రాజ్యాంగ, రక్షణ వ్యవహారాలు మాత్రమే చూడాలని సాంప్రదాయ ఆర్థిక శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంటే మార్కెట్ యంత్రాంగానికి అన్నీ వదిలేయాలని అర్థం.

ప్రభుత్వం వ్యాపారా..?

లాభాన్ని ఉద్దేశించి ప్రభుత్వాలు ఎప్పుడూ పెట్టుబడులు పెట్టవు. ఉద్యోగాలు కల్పించేందుకు, ఆదాయాలు పెరిగేందుకు, ఆర్థికవృద్ధి సాధించేందుకు, సంక్షేమ రాజ్యాన్ని సాధించేందుకు మాత్రమేనని పాలకులు గమనించాలి. ఇలా శతాబ్దాలుగా ప్రభుత్వాలు తమ దిశ మార్చుకుంటూ ప్రజలను కాపాడుకుంటూ సంక్షేమ రాజ్యాలుగా మారాయని మరువరాదు. పాలకులు ఎప్పుడూ ప్రజల కోసం పనిచేయాలి. బడుగు బలహీన వర్గాలుగా ఎవరున్నారో అనేది తెలుసుకోవాలంటే కుల గణన తక్షణ అవసరం. ఆప్పుడు పేదలు ఎవరో తెలుస్తుంది. తద్వారా ఉత్పత్తి పద్ధతులను ఎంపిక చేయాలి. ఆ విధంగా పెట్టుబడులు పెట్టాలి. తద్వారా ఆదాయ కల్పనలు జరగాలి. అదే సంక్షేమ రాజ్యం ఇలా సామ్యవాద తరహా సమాజాన్ని నిర్మించుకోవాలని దిశానిర్దేశం చేసింది మన రాజ్యాంగం.

డా. ఎనుగొండ నాగరాజనాయుడు

రిటైర్డ్ ప్రిన్సిపాల్, తిరుపతి.

98663 22172

Advertisement

Next Story

Most Viewed