మధ్యప్రదేశ్‌లో అమానుష ఘటన.. నోటితో షూస్‌ను ఎత్తాలంటూ..

by Vinod kumar |
మధ్యప్రదేశ్‌లో అమానుష ఘటన.. నోటితో షూస్‌ను ఎత్తాలంటూ..
X

రేవా : రెండేళ్ల క్రితం జరిగిన ఒక అమానుష ఘటన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. దీంతో ముగ్గురు నిందితులను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో జరిగిన ఆ ఘటన వివరాల్లోకి వెళితే.. కొందరు అల్లరి మూకలు 34 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తిని నగ్నంగా చేశారు. అతడి రెండు చేతులను వెనక్కి కట్టి, ఘోరంగా కొట్టి, నీచంగా తిట్టారు. నోటితో తమ షూస్ ను ఎత్తాలంటూ ఆ వ్యక్తిని బలవంతం చేశారు. "దయచేసి నన్ను వదిలేయండి" అని అతడు వేడుకున్నా అల్లరి మూకలు కనికరించలేదు. రేవా జిల్లాలోని హనుమ్నా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పిప్రాహి గ్రామంలో 2021 మేలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో గతవారం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చివరకు ఇది పోలీసులకు కూడా చేరడంతో యాక్షన్ మొదలైంది.

ఆస్తి వివాదమే ప్రధాన కారణం..

వీడియో ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు ప్రధాన నిందితుడు జవహర్ సింగ్ (55), అతని ఇద్దరు సహచరులను సోమవారం అరెస్టు చేశారు. స్థానిక కోర్టులో హాజరుపర్చిన అనంతరం ముగ్గురిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఆస్తి వివాదమే ఈ ఘటనకు ప్రధాన కారణమని రేవా జిల్లా ఎస్పీ వివేక్ సింగ్ వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు గిరిజనుడు కాగా, బాధితురాలు అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి అని ఆయన చెప్పారు. ప్రధాన నిందితుడు జవహర్ సింగ్ ప్రభుత్వ పాఠశాలలో క్లర్క్‌గా పనిచేస్తున్నాడని, అతడు ఒక గ్రామ సర్పంచ్ భర్త అని ఎస్పీ వివరించారు.

Advertisement

Next Story

Most Viewed