కాపురం చేయను... పిల్లల్ని పంపను...అన్నందుకు...

by Sridhar Babu |
కాపురం చేయను... పిల్లల్ని పంపను...అన్నందుకు...
X

దిశ, భిక్కనూరు : కాపురానికి రానని, పిల్లల్ని పంపనని భార్య తెగేసి చెప్పడంతో భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన భిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పాత దళితవాడకు చెందిన కర్రోళ్ల కైలాస్ (45) తనకున్న వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ, ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి మరో మహిళతో లైంగిక సంబంధం ఉందని భార్య రజిత తరచూ గొడవపడేది. రెండు రోజుల క్రితం రాత్రి ఇదే విషయమై భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో రజితను కైలాస్ కొట్టాడు. దీంతో భార్య రజిత మరుసటి రోజు పోలీస్ స్టేషన్ కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది.

అదే రోజు రాత్రి తన పిల్లల్ని తీసుకొని దోమకొండ మండలం మాందాపూర్ లో ఉన్న పుట్టింటికి వెళ్లింది. అనంతరం పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఈ విషయంపై పోలీసులను ప్రశ్నించింది. అక్కడి నుంచే భర్తతో ఫోన్ లో మాట్లాడి కాపురానికి రానని, పిల్లల్ని కూడా పంపనని తేల్చి చెప్పడంతో తీవ్ర మనోవేధనతో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటిదాకా అందరితో మాట్లాడిన కైలాస్ ఉన్నట్టుండి ఇంటికి ఎందుకు వెళ్లాడని గమనించిన చుట్టుపక్కల వారు ఆయన వెనకాలే వెళ్లగా తలుపులు మూసి ఉండడంతో బలంగా కొట్టి లోనికి ప్రవేశించారు.

అప్పటికే ఉరివేసుకొని ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కైలాస్ ను కిందకు దించి, చికిత్స నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు ధృవీకరించారు. కైలాస్ ఆత్మహత్యతో హరిజనవాడలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య రజిత ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. తల్లి పోచవ్వ ఫిర్యాదు మేరకు ఎస్ఐ సాయి కుమార్ కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Next Story

Most Viewed