కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు అధికారులకు శిక్ష

by srinivas |
కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు అధికారులకు శిక్ష
X

దిశ, ఏపీ బ్యూరో: కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారి, ప్రస్తుత పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్, అప్పటి ఉద్యానవనశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరిలకు హైకోర్టు మంగళవారం శిక్ష అమలు చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైనందుకు గానూ వెయ్యి రూపాయల జరిమానాతోపాటు కోర్టు పని గంటలు ముగిసే వరకు న్యాయస్థానంలోనే ఉండాలని ఆదేశించింది. దీంతో అధికారులు ఇద్దరూ జరిమానా చెల్లించడంతోపాటు కోర్టు పనివేళలు ముగిసే వరకు అక్కడే ఉన్నారు. ఇకపోతే కోర్టు ఆదేశించినా పోస్టుల భర్తీలో తమకు అవకాశం కల్పించ లేదంటూ 36 మంది అభ్యర్థులు ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టులో వాదన జరిగింది.

కోర్టు ఆదేశాలను ధిక్కరించారని నిర్ధారణ అవ్వడంతో ఇద్దరి అధికారులకు తొమ్మిదిరోజులపాటు సాధారణ జైలు శిక్ష, వెయ్యిరూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశాలిచ్చారు. జరిమానా చెల్లించడంలో విఫలమైతే మూడు రోజులు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు. ఈ తీర్పుపై అధికారులు స్పందించారు. తమను క్షమించాలని వేడుకున్నారు. తమ వయసు, తాము అందించిన సేవలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. దీంతో స్పందించిన హైకోర్టు తీర్పును సవరించింది. వెయ్యి రూపాయల జరిమానాతోపాటు కోర్టు పని గంటలు ముగిసే వరకు న్యాయస్థానంలోనే ఉండాలని ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed