GDP: ఎన్నికలు జీడీపీ వృద్ధిని ప్రభావితం చేశాయి: RBI గవర్నర్

by Harish |   ( Updated:2024-08-31 13:55:53.0  )
GDP: ఎన్నికలు జీడీపీ వృద్ధిని ప్రభావితం చేశాయి: RBI గవర్నర్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 15 నెలల కనిష్ఠమైన 6.7 శాతంగా నమోదు కాగా, దీనిపై ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ శనివారం మాట్లాడుతూ, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా ప్రభుత్వ వ్యయం తక్కువ కావడంతో వృద్ధి మందగించిందని అన్నారు. వృద్ధి రేటును ఆర్‌బీఐ 7.1 శాతంగా అంచనా వేయగా, జాతీయ గణాంక కార్యాలయం (NSO) నివేదించిన వాస్తవ డేటా 6.7 శాతంగా నమోదైంది. అయితే అంచనాలను అందుకోలేకపోయినప్పటికి కూడా చాలా రంగాల్లో వృద్ధి 7 శాతాన్ని అధిగమించి పటిష్టంగా ఉందని గవర్నర్ దాస్ ఈ సందర్భంగా చెప్పారు.

వినియోగం, పెట్టుబడులు, తయారీ, సేవలు, నిర్మాణం వంటి జీడీపీ వృద్ధికి ముఖ్యమైన విభాగాలు 7 శాతం కంటే ఎక్కువగానే వృద్ధిని నమోదు చేశాయి, కేవలం రెండు అంశాలు మాత్రమే వృద్ధి రేటును కొద్దిగా తగ్గించాయి. అవి ప్రభుత్వ (కేంద్ర- రాష్ట్ర) వ్యయం, వ్యవసాయం అని దాస్ అన్నారు.

ఏప్రిల్ నుండి జూన్ కాలంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో ప్రభుత్వం తక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎన్నికలు పూర్తయ్యాయి, రాబోయే త్రైమాసికాల్లో ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది, వృద్ధికి విస్తారమైన అవకాశాలు ఉన్నాయి, 7.2 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదవుతుందని దాస్ చెప్పారు.

అదే విధంగా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వ్యవసాయ రంగం దాదాపు 2 శాతం కనిష్ట వృద్ధి రేటును నమోదు చేసింది. అయితే, ప్రస్తుతం రుతుపవనాలు చాలా సానుకూలంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు మినహా అవి భారతదేశం అంతటా వ్యాపించాయి. దేశంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. కాబట్టి, వ్యవసాయ రంగం పట్ల ప్రతి ఒక్కరూ ఆశాజనకంగా, సానుకూలంగా ఉన్నారని దాస్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed