లేడీ డాక్టర్ పై పేషెంట్ దాడి..స్పృహలోకి రాగానే ఏం చేశాడంటే?

by Jakkula Mamatha |   ( Updated:2024-08-25 14:56:32.0  )
లేడీ డాక్టర్ పై పేషెంట్ దాడి..స్పృహలోకి రాగానే ఏం చేశాడంటే?
X

దిశ,వెబ్‌డెస్క్:తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్ పై ఓ రోగి చేయి చేసుకున్నాడు. అందరూ చూస్తుండగానే దాడికి దిగాడు. ఈ ఘటనను ఖండిస్తూ జూనియర్ డాక్టర్లు ధర్నాకు దిగారు. అయితే ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు వార్డులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. వివరాల్లోకి వెళితే..మద్యానికి బానిసైన ఓ వ్యక్తి శనివారం తిరుమలలో స్పృహ కోల్పోయాడు. అక్కడ ఉన్న స్థానికులు అతడిని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే మెరుగైన చికిత్స కోసం శనివారం ఉదయం తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి మార్చారు. స్విమ్స్ ఆస్పత్రికి వచ్చిన తర్వాత సదరు వ్యక్తి స్పృహలోకి వచ్చాడు. స్పృహలోకి వచ్చిన వ్యక్తి వింతగా ప్రవర్తించాడు. మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలా తనకు చికిత్స చేస్తున్న లేడీ డాక్టర్ పై దాడికి దిగాడు. వార్డులో అందరూ చూస్తుండగానే చేయి చేసుకున్నాడు.

ఈ వ్యవహారం మొత్తం వార్డులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. లేడీ డాక్టర్ పై దాడి ఘటనను తోటి వైద్యులు తీవ్రంగా ఖండించారు. ఆస్పత్రిలో వైద్యులు ఆందోళనకు దిగడంతో టీటీడీ ఈవో వచ్చి ఈ ఘటనపై సమాధానం చెప్పాలంటూ ఆస్పత్రి ముందు బైఠాయించారు. డాక్టర్ల ఆందోళన సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డాక్టర్ పై చేయి చేసుకున్న రోగి మానసిక స్థితి బాగా లేదని నిర్ధారించినట్లు తెలుస్తోంది. దాడి చేసిన రోగి స్వస్థలం నల్లగొండ జిల్లాగా పోలీసులు గుర్తించారు. స్విమ్స్‌లో మహిళా సెక్యూరిటీని నియమించాలని జూడాల డిమాండ్. స్విమ్స్ లో వైద్యుల ఆందోళన పై ప్రభుత్వం స్పందించింది. తిరుపతి కలెక్టర్ అధికారులతో సీఎంవో అధికారులు మాట్లాడారు. ఈ క్రమంలో వైద్యులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.

Advertisement

Next Story