AP Capital: రెండు రోజులు విశాఖలో.. 3 రోజులు అమరావతిలో..!

by srinivas |
AP Capital: రెండు రోజులు విశాఖలో.. 3 రోజులు అమరావతిలో..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ రాజధాని విషయంలో సీఎం జగన్ వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పటికీ ఢిల్లీ వేదికగా సీఎం జగన్ విశాఖ రాజధాని అని.. త్వరలోనే తాను కూడా షిఫ్ట్ అవుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకవైపు అమరావతి ఉద్యమం జరుగుతున్నప్పటికీ రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ బీజేపీ సైతం మోకాలడ్డుతున్నా నిర్ణయం తీసేసుకున్నా వెనక్కి తగ్గను అన్నట్లు సీఎం జగన్ వ్యవహరిస్తున్నారు. వీలైనంత త్వరలో విశాఖకు షిఫ్ట్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. మార్చి రెండో వారం లేదా ఏప్రిల్ మొదటి వారానికల్లా విశాఖకు తరలిపోవాలని సీఎం జగన్ ముహూర్తం ఫిక్స్ చేసుకున్ననట్లు తెలుస్తోంది.

తాత్కాలిక నివాసంగా పోర్ట్ గెస్ట్‌హౌస్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ నుంచి పరిపాలన కొనసాగించడానికి అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేస్తోంది. కొన్ని రోజులుగా జగన్ నివాసానికి సంబంధించి విశాఖలో అధికార యంత్రాంగం జల్లెడ పట్టింది. అయినప్పటికీ ఎక్కడా నివాసానికి ఇల్లు దొరకలేదు. దీంతో ప్రస్తుతానికి తాత్కాలికంగా పోర్ట్ గెస్ట్‌హౌస్ నుంచే సీఎం జగన్ పరిపాలన చేసేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం నివాసానికి సంబంధించి రిషికొండలో ఇప్పటికే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అది పూర్తయ్యేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని తెలియడంతో ప్రస్తుతానికి పోర్ట్ గెస్ట్‌హౌస్ నుంచే పాలన చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

వారానికి రెండు రోజులే మకాం

రిషికొండలో ఇంటి నిర్మాణం పూర్తి అయితే అక్కడ నుంచే ఇక పాలన పూర్తి స్థాయిలో అందించాలని సీఎం జగన్ భావించారు. అయితే అందుకు పరిస్థితులు అనుకూలించడం లేదు. ఇంటి నిర్మాణానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోర్ట్ గెస్ట్ హౌస్‌లో ఉంటూ పాలన చేపట్టాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వారంలో రెండు రోజులు మాత్రమే అక్కడ నుంచి పరిపాలన కొనసాగించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. షిఫ్ట్ అయిన తర్వాత ప్రతి సోమ, మంగళవారం విశాఖ‌లోనే సీఎం జగన్ అందుబాటులో ఉంటారని తెలుస్తోంది.

ప్రతీ బుధవారం పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రాంతంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. బుధవారం రాత్రి పల్లె నిద్రలో భాగంగా ఆయా ప్రాంతాల్లో సీఎం జగన్ బస చేయనున్నారు. అనంతరం గురువారం ఉదయం విశాఖకు వెళ్లి అక్కడ నుంచి రాత్రికి అమరావతి చేరుకుంటారని తెలుస్తోంది. శుక్ర, శని, ఆది ఈ మూడు రోజలు సీఎం జగన్ అమరావతిలో ఉంటారని ప్రచారం జరుగుతుంది.

Next Story

Most Viewed