ఔట్‌సోర్స్ ఖాళీల భర్తీకి బ్రేక్

by Mahesh |
ఔట్‌సోర్స్ ఖాళీల భర్తీకి బ్రేక్
X

దిశ, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీలో ఖాళీ అవుతున్న ఔట్‌సోర్స్, పర్మినెంట్ పోస్టులలో ఇక భర్తీలుండవు. దీనికి జీహెచ్ఎంసీ ఆర్థిక సంక్షోభం తీవ్రరూపు దాల్చటమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఖాళీ పోస్టులను తన అనుమతి లేనిదే భర్తీ చేయరాదంటూ ఇటీవలే బదిలీ అయిన కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. వివిధ కారణాలతో మృతి చెందిన ఉద్యోగి స్థానంలో ఆయన కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పిస్తూ చేపట్టాల్సిన కారుణ్య నియామకాలకు కూడా బ్రేక్ పడినట్లు తెలిసింది. ఫలితంగా జీహెచ్ఎంసీ ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ, పని భారం పెరుగుతుంది. దీంతో జీహెచ్ఎంసీ అందించే సేవలపై నేరుగా ప్రభావం చూపుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అమలుకు నోచుకోని సర్కార్ ఉత్తర్వులు..

జీహెచ్ఎంసీలోని సుమారు 30 విభాగాల్లో ప్రస్తుతం సుమారు 30 వేల మంది పర్మినెంట్, ఔట్‌సోర్స్ కార్మికులు, ఉద్యోగులున్నారు. కారుణ్య నియామకాలను ఔట్‌సోర్స్ ఉద్యోగులకు కూడా వర్తింపజేసేలా 2017లో సర్కారు ఉత్తర్వులు జారీ చేసినా, వాటిని కూడా అమలు చేయడం లేదని విమర్శలున్నాయి. ఖాళీలను సకాలంలో భర్తీ చేయకపోవడంతో అంతంతమాత్రం జీతాలకు పనిచేసే ఔట్‌సోర్స్ కార్మికులపైనే భారం పడుతుంది. ఒక్క శానిటేషన్ విభాగంలోని శానిటరీ ఫీల్డు అసిస్టెంట్లు, స్వీపర్ల పోస్టులు సుమారు వెయ్యి వరకు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ఎంటమాలజీ, వెటర్నరీ, శానిటేషన్ విభాగాల్లో ఏర్పడుతున్న ఖాళీలను స్థానిక డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు లక్షల్లో లంచాలు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా భర్తీ చేస్తున్నట్టు సమాచారం. విధి నిర్వహణలో చనిపోయిన ఉద్యోగుల వారసులు కూడా కారుణ్య నియామకాల కోసం ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నట్లు సమాచారం.

పర్మినెంట్ ఉద్యోగుల పనెంత?..

జీహెచ్ఎంసీ పర్మినెంట్ ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదు. వీరిలో సుమారు 1200 నుంచి 1250 మంది వివిధ యూనియన్లలో లీడర్లుగా చెలామణి అవుతూ అటెండెన్స్‌ను వేయించుకుని జీతాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలాంటి ఉద్యోగులు జీహెచ్ఎంసీ ఖజానాకు భారంగా మారుతున్నట్లు పలు ఉద్యోగ సంఘాలే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నాయి. వాస్తవానికి వీరిలో ఎక్కువ మంది కార్మిక సంక్షేమం ముసుగులో పైరవీలు, అవకతవకలకు పాల్పడుతున్నా వారిని ఉన్నతాధికారులు కనీసం ప్రశ్నించే సాహసం చేయకపోవడం గమనార్హం. మరి కొందరు తమ ఉద్యోగాల్లో షాడో ఉద్యోగులను నియమించి పబ్బం గడుపుతున్నట్లు ఆరోపణలున్నాయి.

ఇక ఎంటమాలజీ విభాగంలోని ఔట్‌సోర్సులో ఖాళీ అవుతున్న వివిధ రకాల పోస్టులను పలు యూనియన్లకు చెందిన నేతలు ఏమాత్రం ఉన్నతాధికారులకు సమాచారమివ్వకుండా సర్కిల్ స్థాయిలోనే నియామకాలు జరుపుతున్నట్లు సమాచారం. చార్మినార్ జోన్ పరిధిలో ఓ యూనియన్ నేత ఇటీవలే ఎంటమాలజీ విభాగంలో ఖాళీ అయిన రెండు పోస్టుల్లో తన కుటుంబ సభ్యులను నియమించుకుని, వారిచే ఇంట్లోనే బయోమెట్రిక్ వేసుకుంటూ జీతాలు డ్రా చేసుకుంటున్నట్లు సమాచారం.



Next Story