చంద్రబాబుకు ఊరట: ఈనెల 28వరకు అరెస్ట్ చేయమన్న సీఐడీ

by Seetharam |
చంద్రబాబుకు ఊరట: ఈనెల 28వరకు అరెస్ట్ చేయమన్న సీఐడీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఇసుక కుంభకోణం కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయడుకు స్వల్ప ఊరట లభించింది. ఇసుక స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌‌పై ఏపీ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబును ఈ నెల 28 వరకు అరెస్ట్ చేయబోమని హైకోర్టుకు సీఐడీ తెలిపింది. చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని సీఐడీ తరఫు న్యాయవాదులు హైకోర్టుకు తెలియజేశారు. సీఐడీ తరపు న్యాయవాదుల స్టేట్మెంట్‌ను రికార్డు చేసిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.

గడువు కోరిన న్యాయవాదులు

ఇకపోతే ఇసుక కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు నాయుడు పిటిషన్‌ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. బుధవారం ఈ పిటిషన్‌ విచారణకొచ్చింది. అయితే విచారణ సందర్భంగా చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని పాస్ ఓవర్ అడిగారు. దీంతో మధ్యాహ్నం పిటిషన్‌ను విచారిస్తామని హైకోర్టు తెలిపింది. లంచ్ విరామం అనంతరం హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడును ఈనెల 28 వరకు అరెస్ట్ చేయబోమని సీఐడీ తరఫు న్యాయవాది తెలిపారు. ఈనెల 28 వరకు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని వెల్లడించారు. దీంతో వారి స్టేట్మెంట్‌ను రికార్డు చేసిన ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది. ఇకపోతే స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 52 రోజులుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే జైలులో చంద్రబాబు నాయుడు తీవ్ర అనారోగ్యం పాలవ్వడంతో ఏపీ హైకోర్టు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంద్రబాబు నాయుడు బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ నెల 28తేదీతో చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ ముగియనున్న సంగతి తెలిసిందే.

రూ.1,300కోట్ల కుంభకోణం

ఇకపోతే చంద్రబాబు నాయుడు హయాంలో ఉచితంగా ఇసుకను ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ. 1,300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఐడీ ఆరోపించింది. ఈ మేరకు ఇసుక పాలసీపైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇసుక పాలసీపై కేబినెట్‌లో చర్చించలేదని సీఐడీ ఎఫ్ఐఆర్‌లో వెల్లడించింది. ఈ కేసులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమా మహేశ్వరరావు పేర్లను చేర్చింది.

సీఐడీ ఆరోపణలపై చంద్రబాబు అభ్యంతరం

ఇసుక కుంభకోణం పేరుతో సీఐడీ ఆరోపణలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. విధానపరమైన నిర్ణయాలకు నేరాలను ఆపాదించడంపై మండిపడ్డారు. 17ఏ ప్రకారం కేసు నమోదుకు గవర్నర్ ఆమోదం తప్పనిసరి అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. సీఐడీ తీరును నిరసిస్తూ ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed