మళ్లీ వైసీపీ అధికారంలోకి రావాలని అమ్మవారిని వేడుకున్నా: మంత్రి ఆర్‌కే రోజా

by Seetharam |
మళ్లీ వైసీపీ అధికారంలోకి రావాలని అమ్మవారిని వేడుకున్నా: మంత్రి ఆర్‌కే రోజా
X

దిశ, డైనమిక్ బ్యూరో : 2024ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చేలా చూడాలని కనకదుర్గ అమ్మవారిని వేడుకున్నట్లు రాష్ట్రపర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా తెలిపారు. దసరా నవరాత్రి వేడుకల్లో భాగంగా బాలాత్రిపుర సుందరి అలంకరణలోని అమ్మవారిని మంత్రి ఆర్‌కే రోజా ఆదివారం దర్శించుకున్నారు. మంత్రి ఆర్‌కే రోజాకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. అధికారులు అమ్మవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాన్ని అందించారు. అనంతరం మంత్రి ఆర్‌కే రోజా మీడియాతో మాట్లాడారు. ప్రతీ దసరా శరన్నవరాత్రుల సమయంలో అమ్మవారిని దర్శించుకుంటున్నట్లు మంత్రి ఆర్‌కే రోజా తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అమ్మవారిని దర్శించుకుని వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి అయ్యేలా ఆశీర్వదించాలని.. వైసీపీ అధికారంలోకి వచ్చేలా ఆశీర్వదించాలని కోరుకున్నట్లు రోజా గుర్తు చేశారు. అమ్మవారి దయతో 2019 లో ఎన్నికల్లో తాను కోరుకున్నట్లే జరిగిందని చెప్పుకొచ్చారు. కనకదుర్గమ్మ ఆశీస్సులతో సీఎం వైఎస్ జగన్ ప్రజారంజక పాలన అందిస్తున్నారని మంత్రి ఆర్‌కే రోజా గుర్తు చేశారు. ఇకపోతే వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయని వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ అత్యధిక స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని... అమ్మవారి ఆశీర్వాదం కూడా అందుకు తోడవుతుందని మంత్రి ఆర్‌కే రోజా ఆకాంక్షించారు.

Advertisement

Next Story