BREAKING: వచ్చే ఎన్నికల్లో పోటీపై ఎంపీ మాగుంట సంచలన నిర్ణయం

by Satheesh |
BREAKING: వచ్చే ఎన్నికల్లో పోటీపై ఎంపీ మాగుంట సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు టీడీపీలో చేరనున్నారు. మరో రెండు రోజుల్లో ఆయన తన కొడుకు రాఘవతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకుకోనున్నారు. ఈ క్రమంలో ఇవాళ మాగుంట తన నివాసంలో టీడీపీ నేతలకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఒంగోలు పార్లమెంట్ టీడీపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మా కుటుంబాన్ని టీడీపీలోకి ఆహ్వానించారని తెలిపారు. టీడీపీలో చేరేందుకు మేం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. టీడీపీలో ఎప్పుడు, ఎక్కడ చేరాలనేది చంద్రబాబు నిర్ణయిస్తారని అన్నారు.

ఒంగోలు ఎంపీ సీటు ఇవ్వాలని చంద్రబాబును కోరామని.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. నాకు రిట్మైరెంట్ వయస్సు వచ్చింది కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో తన కొడుకు మాగుంట రాఘవ పోటీ చేస్తాడని క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని మాగుంట తేల్చి చెప్పారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా తన కుమారుడు పోటీ చేస్తారని స్పష్టం చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమితో కలిసి పని చేయడం ఆనందంగా ఉందన్నారు. ఏపీలో కూటమి విజయానికి తమ వంతు కృషి చేస్తామన్నారు.

Next Story