Krishna river:పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ..ప్రాజెక్టులకు భారీ వరద

by Jakkula Mamatha |
Krishna river:పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ..ప్రాజెక్టులకు భారీ వరద
X

దిశ ప్రతినిధి,గుంటూరు:ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో జలాశయం ఎనిమిది గేట్లు పది అడుగుల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా 2,71,668 క్యూసెక్కులు, శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 67,668 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల, హంద్రీ నుంచి 2,16,973 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం నీటిమట్టం 884.20 అడుగులు, నీటి నిల్వ 210.99 టీఎంసీలు గా నమోదయింది.

ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద..

నాగార్జున సాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో సాగర్‌ 16 గేట్లను 5 అడుగుల మేర, 8గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,48,080 క్యూసెక్కులు, విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 28,298 క్యూసెక్కులు, కాలువల ద్వారా 5,112 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ ఇన్‌ఫ్లో 2,62,275 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 312.04 టీఎంసీలు కాగా..ప్రస్తుత నీటిమట్టం 310.55 టీఎంసీలుగా ఉంది. మరో వైపు పులిచింతల ప్రాజెక్టు ఔట్‌ఫ్లో 2.86 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. బ్యారేజీ నుంచి ప్రస్తుతం 65 గేట్లు ఎత్తి 3.05 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Advertisement

Next Story