వైసీపీలోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ...క్లారిటీ ఏంటంటే

by Seetharam |   ( Updated:2023-10-30 07:44:59.0  )
వైసీపీలోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ...క్లారిటీ ఏంటంటే
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆయనో మాజీ ఉన్నతాధికారి. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ప్రభుత్వాలు మంచి చేస్తే అభినందించడం.. చెడు చేస్తే విమర్శించడం ఆయనకు సహజం. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన ఓటమి పాలైన ఆయన అనంతరం రాజకీయాలకు దూరమయ్యారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. ఇటీవలే వైస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రశంసల జల్లు కురిపించారు. అసలే ఎన్నికల సీజన్‌. దీంతో ఆయన వైసీపీలో చేరిపోతారని హాట్ హాట్‌గా ప్రచారం జరిగింది. దీంతో ఆయనను వైసీపీలోకి కొందరు స్వాగతిస్తే మరికొందరు వ్యతిరేకించడం జరిగిపోయింది. మరికొందరైతే జనసేనలో చేరాలని ఇలా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దీంతో సదరు మాజీ ఉన్నతాధికారి ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న పోరుకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఈ సోషల్ మీడియాతో వేగలేకపోతున్నామని భావించిన ఆయన చివరకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇంతకీ ఆ మాజీ ఉన్నతాధికారి ఎవరు? ఎప్పుడు వైసీపీని ప్రశంసించారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఓసారి ఈ వార్త చదవాల్సిందే.

లక్ష్మీనారాయణ పొలిటికల్ కెరీర్

సీబీఐ మాజీ జేడీ వాసగిరి లక్ష్మీనారాయణ. ఇప్పుడు ఈ పేరు తెలియనివారు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన లక్ష్మీనారాయణ డీఐజీ హోదాలో ఉన్నప్పుడే కేంద్రానికి డిప్యుటేషన్ పై వెళ్ళి సీబీఐలో బాధ్యతలు చేపట్టారు. సీబీఐ డీఐజీగా 2006 జూన్‌లో సొంతరాష్ట్రమైన హైదరాబాద్ లో విధుల్లో చేరారు. అనంతరం సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా సంచలనాత్మక కేసుల దర్యాప్తులో కీలకంగా మారారు. వోక్స్‌ వ్యాగన్‌ కేసుపై దర్యాప్తు చేశారు. అనంతరం వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయంలో తలపెట్టిన అవుటర్‌ రింగ్‌రోడ్డులో భూసేకరణ, అందులో జరిగిన అక్రమాలకు సంబంధించి దర్యాప్తు జరిపి న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. అనంతరం సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణం కేసులో కీలకంగా వ్యవహరించారు. రూ.7వేలకోట్ల కుంభకోణానికి సంబంధించిన ఈ కేసుపై సమర్థంగా దర్యాప్తు జరపడంతో జేడీ లక్ష్మీనారాయణపేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. అనంతరం ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసు, జగన్‌ అక్రమ ఆస్తుల కేసు, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసులను దర్యాప్తు చేసి తెలుగు రాష్ట్రాల్లో ఆయనంటే ఎవరో తెలియనంతగా చేరువైపోయారు. ఓఎంసీ కేసు దర్యాప్తులో భాగంగా కర్ణాటక ఎంపీ గాలి జనార్దనరెడ్డి, ఓఎంసీ ఎండీ శ్రీనివాసరెడ్డిలను అరెస్టు చేయడంతో లక్ష్మీనారాయణ వార్తల్లో నిలిచారు. ఐఏఎస్ అధికారులు సైతం ఈ కేసుల్లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసును విచారించి ఇక దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. ఇకపోతే సీబీఐ జేడీగా పనిచేసిన వీవీ లక్ష్మీనారాయణ అనంతరం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. జనసేన పార్టీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.. 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత పరిణామాలతో జనసేనకు రాజీనామా చేశారు. అయితే లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని చెబుతున్నారు.

వైసీపీలో చేరతారంటూ ప్రచారం

ఇటీవలే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ శ్రీశైలంలో పర్యటించారు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ శిల్పా చక్రపాణి రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య శిబిరాలు, నాడు-నేడు కార్యక్రమాలను అభినందించారు.నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు చాలా అందంగా ముస్తాబయ్యాయని ప్రశంసించారు. అంగన్వాడీలలో చిన్న పిల్లలకు పౌష్టికాహారం రాగిజావ చేర్చడంపై పొగడ్తలు కురిపించారు.అంతేకాదు జగనన్న ఆరోగ్య సురక్ష అద్భుత కార్యక్రమం అని కొనియాడారు. ఇలా పలు అంశాలపై ప్రశంసలు కురిపించడంతో లక్ష్మీనారాయణ వైసీపీలో చేరతారనే ప్రచారం జరిగింది.

అభినందిస్తే పార్టీలో చేరుతున్నట్లేనా?

వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అభినందించినంత మాత్రాన తాను అధికార పార్టీలో చేరుతున్నానని ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వారి టిక్కెట్టుపై పోటీ చేస్తానంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరికాదన్నారు. తాను వైసీపీలో చేరుతానంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పుకొచ్చారు. ప్రజలు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభ్యర్థించారు. ఓటర్ల చైతన్య కార్యక్రమం కొనసాగించే తన పోరుబాటకు కట్టుబడి ఉన్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed