తెలుగు తమ్ముళ్లను ఊరిస్తున్న ఆ సీటు.. ఎటు తేల్చకుండా ఉడికిస్తున్న అధిష్టానం

by Indraja |   ( Updated:2024-03-24 08:46:53.0  )
తెలుగు తమ్ముళ్లను ఊరిస్తున్న ఆ సీటు.. ఎటు తేల్చకుండా ఉడికిస్తున్న అధిష్టానం
X

దిశ వెబ్ డెస్క్: దర్శి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలను ఊరిస్తున్న నియోజక వర్గం. దాదాపు అర డజన్ మంది అభ్యర్థులు ఆ సీటు కోసం కాచుకు కూర్చొని ఉన్నారు. నిన్నామొన్నటివరకు పొత్తులో భాగంగా ఆ నియోజకవర్గం జనసేనదే అనే టాక్ నడిచింది. దీనితో ఆ సీటుపై తెలుగు తమ్ముళ్ల ఆశలన్నీ ఆవిరైపోయాయి. అయితే తాజగా ఆ నియోజకవర్గం టీడీపీదే అని అధికార ప్రకటన వెలువడింది.

దీనితో వాడిపోయిన తెలుగు నేతల ఆశలు మళ్ళీ చిగురించాయి. సీటు తమకే వస్తుంది అనే ధీమాతో ఉన్నారు. అయితే టీడీపీ అధిష్టానం మాత్రం ఉమ్మడి ప్రకాశం జిల్లా లోని అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. కానీ దర్శి అభ్యర్థిని ప్రకటించకుండా నేతలను ఉడికిస్తోంది. ఇక దర్శిలో ఒక సారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మరో సారి గెలవరు అనే సెంటిమెంట్ గత ఆరు దశాబ్దాలుగా వస్తోంది.

ఇక ఆ నియోజకవర్గంలో వరుసగా రెండుసార్లు గెలిచినా వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దిరిశెల వెంకటరమణారెడ్డి మాత్రమే అని చరిత్ర చెబుతోంది. ప్రతి ఎన్నికల్లో కొత్త ఎమ్మెల్యేను ఎన్నుకోవడం దర్శిలో ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి టికెట్ కేటాయించింది.

అయితే టీడీపీ మాత్రం ఎన్నికల సమయం దగ్గర పడుతున్న దర్శి అభ్యర్థి విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. టీడీపీ ప్రస్థానం మొదలైనప్పటి నుండి ఇప్పటికి పదిసార్లు ఎన్నికలు జరిగితే అందులో ఐదు సార్లు టీడీపీ విజయాపథకం ఎగురవేసింది. ఇక కాంగ్రెస్ మూడుసార్లు గెలుపొందగా.. ఒకసారి ఇండిపెండెంట్ గెలిచారు. ఇక గత ఎన్నికల్లో వైసీపీ గెలిచింది.

అయితే గత ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలైన కదిరి బాబురావు.. ఆ తరువాత వైసీపీ గూటికి చేరుకున్నారు. ఇక 20214 ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలుపొందిన శిద్దా రాఘవరావు 2019లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆయన కూడా వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. దీనితో ప్రస్తుతం దర్శిలో టీడీపీకి బలమైన నాయకత్వం లేకుండాపోయింది.

అయితే ప్రస్తుతం ఊహించని రీతిలో టీడీపీ నుండి శిద్దా రాఘవరావు పేరు వినిపిస్తోంది. ప్రస్తతం వైసీపీ గూటిలో ఉన్న శిద్దా ఫ్యాన్ కింద నుండి లేచి సైకిలి ఎక్కేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. మాగుంట శ్రీనివాస్ కూడా దర్శిలో శిద్దా ఉంటే రానున్న ఎన్నికల్లో విజయం సిద్ధిస్తుందని టీడీపీ అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. అందుకే టీడీపీ అధిష్టానం దర్శిలో కాండిడేట్ ను ప్రకటించలేదని.. శిద్దా కోసం వేచి చూస్తోందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed