జాతీయ విపత్తుగా ప్రకటించి ఆదుకోండి: తుఫానుపై ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ

by Seetharam |
జాతీయ విపత్తుగా ప్రకటించి ఆదుకోండి: తుఫానుపై ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో : మిచౌంగ్ తుఫాన్ వల్ల తీవ్ర స్థాయిలో నష్ట పోయిన రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని ప్రధాని నరేంద్రమోడీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ప్రాణ, ఆస్థినష్టం జరిగిందని లేఖలో ప్రధాని మోడీకి తెలిపారు. తుఫాను తీవ్రత దృష్ట్యా మిచౌంగ్ తుఫానును జాతీయ విపత్తుగా ప్రకటించి సాయం చేయాలని కోరారు. ఏపీలో మిచౌంగ్ తుఫాను నష్టాన్ని మీ దృష్టి కి తెచ్చేందుకు ఈ లేఖ రాస్తున్నట్లు చెప్పుకొచ్చారు.రాష్ట్రంలోని 15 జిల్లాల్లో తుఫాను తీవ్ర ప్రభావం చూపింది అని చెప్పుకొచ్చారు. 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు ప్రజల జీవనాన్ని దెబ్బతీశాయి అని ఆరోపించారు. తుఫాను కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని లేఖలో చంద్రబాబు ప్రధాని మోడీకి తెలియజేశారు.

రూ.10వేల కోట్ల మేర పంట నష్టం

ప్రాథమిక అంచనాల ప్రకారం 22 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని లేఖలో చంద్రబాబు నాయుడు తెలియజేశారు. ఫలితంగా రూ. 10 వేల కోట్ల వరకు పంట నష్టం ఉంటుందని అంచనాగా తెలియజేశారు. పంటలు దెబ్బతినడంతో పాటు పలు చోట్ల పశువులు చనిపోయాయి, చెట్లు విరిగిపడ్డాయి. దాదాపు 770 కి.మీల మేర రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. తాగునీరు, నీటిపారుదల, విద్యుత్, కమ్యూనికేషన్ రంగాలకు నష్టం జరిగింది అని తెలిపారు. వ్యవసాయంతో పాటు ఆక్వా రంగం కూడా నష్టపోయింది అని చెప్పుకొచ్చారు. తుఫాను వల్ల పంట నష్టపోయి ఆవేదనతో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకార పడవలు, వలలకు కూడా నష్టం జరిగింది. వారు జీవనోపాధి కోల్పోయారని తెలిపారు.తుఫాను ప్రభావం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాలేదు. పొరుగున ఉన్న తమిళనాడుపై కూడా ప్రభావం చూపింది అని గుర్తు చేశారు. తుఫాను తీవ్రత, నష్టం దృష్ట్యా మిచౌంగ్ తుఫానును 'జాతీయ విపత్తు'గా ప్రకటించాలని లేఖలో చంద్రబాబు కోరారు. తుఫాను నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి ఒక బృందాన్ని పంపాలని కోరారు. జాతీయ విపత్తుగా ప్రకటిస్తే తక్షణ, మెరుగైన సహాయం బాధితులకు అందుతుంది. మీ ప్రకటన ద్వారా తుఫాను బాధితులలో విశ్వాసాన్ని నింపే అవకాశం ఏర్పడుతుంది అని చంద్రబాబు నాయుడు లేఖలో ఆకాంక్షించారు.

Advertisement

Next Story