బాపట్ల తీరానికి మిచౌంగ్ తుపాను: మూడు గంటలు అలర్ట్

by Seetharam |
బాపట్ల తీరానికి మిచౌంగ్ తుపాను: మూడు గంటలు అలర్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో :తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను మిచౌంగ్ తుపాను వణికిస్తోంది. ఈ తుపాను ప్రభావంతో రెండు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. భారీ వర్షాలతో ఇరు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు రాష్ట్రాలను వణికిస్తున్న ఈ మిచౌంగ్ తుపాను బాపట్ల వద్ద తీరాన్నితాకింది. బంగాళాఖాతంలో ఉన్న తుపాను తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ నిర్ధారించింది. అయితే పూర్తి స్థాయిలో తీరం దాటేందుకు మరో 3 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. ఈ మూడు గంటల్లో కోస్తా తీర ప్రాంతం అంతా అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. మిచౌంగ్ తుపాను తీరం దాటిన తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

భారీ వర్షాలపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్

మిచౌంగ్ తుపాను తీరాన్ని తాకినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా వెల్లడించింది. మరో రెండు లేదా మూడు గంటల్లో ఇది పూర్తిగా తీరాన్ని దాటనుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.తుపాను తీరం దాటిన అనంతరం మరింత వర్షం కురిసే అవకాశం ఉందని కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇకపోతే తుపాను ప్రభావంతో మంగళవారం కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. మరికొన్ని చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కూడా పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Advertisement

Next Story