Visakhapatnam:అర్జీలు సత్వరమే పరిష్కారం కావాలి:జిల్లా కలెక్టర్

by Jakkula Mamatha |
Visakhapatnam:అర్జీలు సత్వరమే పరిష్కారం కావాలి:జిల్లా కలెక్టర్
X

దిశ ప్రతినిధి,విశాఖపట్నం:ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలు సత్వరమే పరిష్కారం కావాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం అందే అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, నిర్ణీత గడువు లోగా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సోమవారం జరిగింది.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, జిల్లా రెవిన్యూ అధికారి కె.మోహన్ కుమార్, ఆర్.డీ.ఓ డి.హుస్సేన్ సాహెబ్ భాగస్వాములై అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 189 అర్జీలు అందగా, వాటిలో పింఛన్ల మంజూరు, స్థానిక సమస్యల పరిష్కారం కోరుతూ ఎక్కువగా వినతులు వచ్చాయి. మొత్తం అందిన అర్జీలలో 67 రెవిన్యూ శాఖ, 55 జీవీఎంసీ, 21 పోలీస్ శాఖ, 46 ఇతర శాఖలకు చెందిన అర్జీలు ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలని అన్నారు. పనితీరులో జవాబుదారీతనం, పారదర్శకత ఉండాలని, అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్లు, జిల్లా అధికారులు, జీవీఎంసీ, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



Next Story