పవన్ కల్యాణ్‌ను మేం లెక్కల్లోకి తీసుకోం.. చంద్రబాబును నమ్మవద్దు : సజ్జల రామకృష్ణారెడ్డి

by Seetharam |   ( Updated:2023-11-29 12:44:35.0  )
పవన్ కల్యాణ్‌ను మేం లెక్కల్లోకి తీసుకోం.. చంద్రబాబును నమ్మవద్దు : సజ్జల రామకృష్ణారెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రచారంపై సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం వైసీపీకి లేదని స్పష్టం చేశారు. ఏపీలో పార్లమెంట్ ఎన్నికలతో పాటే ఎలక్షన్‌లు జరుగుతాయని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తున్న వార్తలు వాస్తవం కాదని వెల్లడించారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తోందో తెలియాల్సి ఉందన్నారు. ఏది ఏమైనప్పటికీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ పోటీకి సిద్ధంగా ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. తాడేపల్లిలో బుధ‌వారం నిర్వ‌హించిన బీసీల ఐక్యత-సమగ్ర అభివృద్ధిపై బీసీ కులాలతో రౌండ్ టేబుల్ సమావేశంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీలకు వైసీపీ ప్రభుత్వం చేసిన పలు అంశాలను వివరించారు. అట్టడుగు వర్గాల రాజకీయ సాధికారత సాధించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యం అని వైసీపీ రాష్ట్ర‌ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఆర్ధిక వెనకబాటుతనం పోగొట్టాలన్నదే సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆలోచన అని స్పష్టం చేశారు. కత్తెర్లు, ఇస్త్రిపెట్టెలు ఇచ్చి సరిపెట్టుకోమంటున్న చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలా? లేక మారుతున్న భవిష్యత్ వైపు అడుగులు వేయిస్తున్న వైఎస్ జగన్ కావాలా? అనేది ఆలోచించాలని కోరారు.

బీసీ అభ్యున్నతికి జగన్ కృషి

‘వచ్చే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఒకటి కాదు మూడు చేస్తామని చెప్తాడు. జగన్ రూపాయి చేస్తే చంద్రబాబు పది చేస్తానంటారని అవి నమ్మి మోసపోవద్దు’ అని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. బీసీల అభ్యున్నతికి జగన్ ఎంతో చేశారన్నారు. అట్టడుగు వర్గాలు సొంతంగా ఎదగాలనేది సీఎం వైయ‌స్‌ జగన్ ఆలోచన. అందులో భాగంగానే అగ్రవర్ణాలతో పోటీ పడే స్థాయికి వచ్చేలా బీసీలకు చేయూతనిస్తున్నారు అని సజ్జల తెలిపారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను తాము అసలు లెక్కల్లోకి తీసుకోవడం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed