టీడీపీ లీడర్లపై వైసీపీ కార్యకర్తల దాడి 

by  |
టీడీపీ లీడర్లపై వైసీపీ కార్యకర్తల దాడి 
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ శివారు ఇబ్రహీంపట్నం వద్ద ఏడుగురు టీడీపీ కార్యకర్తలపై దాడి జరిగింది. కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్‌ పరిశీలనకు టీడీపీ బృందం వెళ్లింది. తిరిగి వచ్చి ఇబ్రహీంపట్నంలోని ఓ హోటల్‌లో భోజనం చేస్తుండగా వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరులు తమపై దాడి చేశారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

గతంలో ఎంపీ నందిగం సురేశ్‌పై సోషల్‌ మీడియాలో టీడీపీ నేత పట్టాభిరాం వద్ద పనిచేస్తున్న అజయ్‌ పోస్టులు పెట్టారు. ఆ కోపంతోనే బూతులు తిడుతూ తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు అజయ్‌ చెప్పారు. మైనింగ్‌తోపాటు తమ నాయకుడు జోలికి వస్తే చంపేస్తామంటూ బెదిరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రశ్నించేవాళ్లపై ఈవిధంగా దాడులు చేయించి భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం జరుగుతోందని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలతో ప్రజాస్వామ్యం అసలు బతికే ఉందా? అనే అనుమానం కలుగుతోందన్నారు. వైసీపీ నేతల అక్రమాలపై టీడీపీ నేతలు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరతామని స్పష్టం చేశారు. ఈరోజు జరిగిన ఘటనను తమ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని.. త్వరలో టీడీపీ సీనియర్‌ నేతల బృందాన్ని కొండపల్లి అక్రమ మైనింగ్‌ పరిశీలనకు పంపుతామని ఆయన చెప్పినట్లు పట్టాభిరామ్‌ వెల్లడించారు.

దాడి చేశామనడం సబబు కాదు

టీడీపీ నాయకులపై దాడి చేశామని వారు ఆరోపించడం సబబు కాదని, దళిత ఎంపీ అయిన నందిగం సురేష్ ను ఉద్దేశపూర్వకంగా అగౌరవపరిచే విధంగా మాట్లాడటంతో సర్దిచెప్పే ప్రయత్నంలో జరిగిన చిరు ఘర్షణ జరిగింది. దాడి అని అక్రమ కేసు పెట్టడం సమంజసం కాదని స్థానిక వైసిపి నాయకులు తెలిపారు.

గతంలో కూడా సజ్జా అజయ్ అనే టీడీపీ కార్యకర్త నందిగామలో ఎంపీ సురేష్ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఇప్పుడు కూడా అదే విధంగా దూషించటంతో తాము అడ్డుకున్నామని, దీనికి మైనింగ్ కు సంబంధం లేని విషయాలను తెరపైకి తెచ్చి టీడీపీ నాయకులు నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.


Next Story

Most Viewed