సారథీ స్టూడియోస్ లో అధునాతన డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియోను ప్రారంభించిన ఎంఎం కీరవాణి

by Disha Web Desk 11 |
సారథీ స్టూడియోస్ లో అధునాతన డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్  స్టూడియోను ప్రారంభించిన ఎంఎం కీరవాణి
X

దిశ, శేరిలింగంపల్లి : హైదరాబాద్ నగరంలో తెలుగు సినిమాకు ఐకాన్ గా నిలుస్తూ..మొట్ట మొదటి స్టూడియోగా పేరున్న సారథీ స్టూడియోస్ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ మరో ముందడుగు వేసింది. మారుతున్న కాలానికి తగట్టు అధునాతన టెక్నాలజీతో అన్ని రకాల హంగులతో ఈ స్టూడియోస్ ను తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలుగు రాష్ట్రాలలోనే అధునాతన డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియోలను సారథీ స్టూడియోస్ ప్రారంభించింది. శుక్రవారం పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో సారథి స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో డాల్బీ మిక్సింగ్ స్టూడియోను ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ప్రారంభించగా, సౌండ్ డిజైన్ స్టూడియోను ప్రముఖ సినీ సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర ప్రారంబించారు.

ఈ సందర్భంగా సారథీ స్టూడియోస్ చైర్మన్ ఎం.ఎస్ ఆర్.వి. ప్రసాద్ మాట్లాడుతూ.. గతంలో ఈ స్టూడియోని మల్టీఫ్లెక్స్ థియేటర్స్ గా మార్చాలన్న ఆలోచన చేసి, ఆ తర్వాత విరమించుకున్నామని, సినీ స్టూడియోస్ గానే కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అనంతరం షూటింగులకు కావలసిన అన్ని రకాల హంగులు, అలాగే నేటి కాలానికి పోటీపడేవిధంగా పోస్ట్ ప్రొడక్షన్స్ కు కావలసిన అధునాతన టెక్నాలజీని మా స్టూడియోలో అందుబాటులోకి తీసుకునివచ్చామన్నారు.కొత్తగా ప్రారంభించిన డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ లు చాలా అధునాతనమైనవని, ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మా స్టూడియోలో మొదలైన మొదటి సినిమా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ సినిమా "కల్కి" అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం అని అన్నారు.

సారథీ స్టూడియోస్ డైరెక్టర్ కె.వి.రావు మాట్లాడుతూ.. మా స్టూడియోలో షూటింగ్ ప్రారంభిస్తే పోస్ట్ ప్రొడక్షన్స్ తో సహా సినిమా మొదటి కాపీని సిద్ధం చేసుకునేంతవరకు కావలసిన ఎక్విప్ మెంట్ అంతా ఉందని అన్నారు. సినిమా అనగానే సౌండింగ్ కు చాలా ప్రాధాన్యం ఉంటుందని, అందుకే అధునాతన టెక్నాలజీని ప్రవేశపెట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు కె.ఎస్.రామారావు, కె.ఎల్.నారాయణ, సంగీత దర్శకుడు భీమ్స్, స్టూడియో జనరల్ మేనేజర్ బాలచంద్ర, ఇంకా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed