పాక్‌లో పోలీస్ స్టేషన్‌పై ఉగ్రదాడి: 10 మంది మృతి

by samatah |
పాక్‌లో పోలీస్ స్టేషన్‌పై ఉగ్రదాడి: 10 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ హింసాత్మక ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల పాక్ ఎన్నికల కార్యాలయంపై బాంబు దాడి ఘటన మరువక ముందే తాజాగా.. సోమవారం తెల్లవారుజామున ఉత్తర పాకిస్థాన్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లా చౌద్వాన్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 10 మంది పోలీసు సిబ్బంది మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. పోలీస్ స్టేషన్‌ను 30 మందికి పైగా ఉగ్రవాదులు చుట్టుముట్టి సుమారు రెండున్నర గంటలకు పైగా కాల్పులు జరిపినట్టు ఖైబర్ పఖ్తుంఖ్వా పోలీసు చీఫ్ అక్తర్ హయత్ వెల్లడించారు. స్టేషన్‌పై మొదట గ్రనేడ్లు విసిరి ఆపై కాల్పులకు తెగపడ్డట్టు తెలిపారు. దాడికి పాల్పడ్డవారిని పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. అయితే ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని సరిహద్దు ప్రాంతాలు కొన్నేళ్లుగా తీవ్రవాదానికి కేంద్రంగా ఉన్నాయి. ఇక్కడి నుంచే పాక్ తాలిబన్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు భద్రతా దళాలే లక్ష్యంగా దాడులకు తెగపడుతున్నాయి.

గత నెలలో 93 ఉగ్రదాడులు!

ఈ ఏడాది జనవరిలో పాక్‌లో దేశ వ్యాప్తంగా 93 ఉగ్రదాడులు జరిగినట్టు ఇస్లామాబాద్‌కు చెందిన థింక్ ట్యాంక్, పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాన్‌ఫ్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ నివేదిక తెలిపింది. ఈ దాడుల్లో 90 మంది మరణించగా..135 మంది గాయపడ్డారు. అలాగే ఆదే టైంలో15 మంది వ్యక్తులు అదృశ్యమైనట్టు పేర్కొంది. కాగా, గత నెల 31న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) అభ్యర్థి రెహాన్ జెబ్ ఖాన్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బజౌర్ జిల్లాలో హత్యకు గురయ్యారు. బైక్‌పై వచ్చిన దుండగులు అతనిపై కాల్పులు జరిపి పరారైన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed