‘మా నాయకుడిని విడుదల చేయండి’ .. భారీ ఆందోళనలు..రాజధానిలో లాక్‌డౌన్, నగరాల్లో ఇంటర్నెట్ బంద్

by karthikeya |   ( Updated:2024-10-04 16:36:40.0  )
‘మా నాయకుడిని విడుదల చేయండి’ .. భారీ ఆందోళనలు..రాజధానిలో లాక్‌డౌన్,   నగరాల్లో ఇంటర్నెట్ బంద్
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు దేశ వ్యాప్తంగా భారీ ప్రదర్శనలు చేస్తూ ఆందోళనలకు దిగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో పూర్తిగా లాక్‌డౌన్ విధించింది. అలాగే ఇస్లామాబాద్, రావాల్పిండి, కరాచీ నగరాలతో పాటు అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ బంద్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆందోళనకారులు రాజధానిలోకి ప్రవేశించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఇమ్రాన్ ఖాన్‌‌ను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలంటూ ఆయన మద్దతుదారులంతా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారని, ఒకవేళ వాళ్లంతా రాజధానిలోకి ప్రవేశిస్తే పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉన్నందున కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఇస్లామాబాద్‌కి రాకుండా అన్ని మార్గాలను మూసేశామని, సెల్‌ఫోన్, ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేశామని వెల్లడించింది. ఇస్లామాబాద్‌ ప్రవేశ మార్గాల్లో ఏకంగా షిప్పింగ్ కంటైనర్లతో సీజ్ చేశారు. సిటీ నలుమూలలా పోలీసులు, పారామిలిటరీ సిబ్బందిని భారీగా మొహించారు. బహిరంగ సభల్ని నిషేధిస్తూ కఠినమైన ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ క్రమంలోనే అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ.. ఎవరైనా ఇస్లామాబాద్‌పై దాడికి ప్రయత్నిస్తే.. తీవ్రంగా పరిగణిస్తామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా.. అక్టోబర్ 15-16 తేదీల్లో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సమావేశానికి మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, చైనీస్ ప్రీమియర్ లీ కియాంగ్‌తో సహా ఇతర దేశాలకు చెందిన అనేక మంది కీలక నాయకులు ఇస్లామాబాద్‌కి వస్తున్నారని, అందువల్ల ర్యాలీలను ఆయా తేదీల్లో వాయిదా వేయాలని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల్ని నఖ్వీ కోరారు.

Advertisement

Next Story

Most Viewed