రఫాపై ఇజ్రాయెల్ దాడి.. 45 మంది పాలస్తీనియన్లు మృతి

by Harish |
రఫాపై ఇజ్రాయెల్ దాడి.. 45 మంది పాలస్తీనియన్లు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచ దేశాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇజ్రాయెల్, రఫా నగరంపై దాడులు మాత్రం ఆపడం లేదు. తాజాగా శుక్రవారం ఇజ్రాయెల్ దళాలు గాజాలోని రఫాపై దాడి చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 45 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు, ఇంకా చాలా మంది గాయపడినట్లు సమాచారం. హమాస్ గ్రూపు కార్యకర్తలను అంతం చేయడమే లక్ష్యంగా సాగుతున్న దాడుల్లో అమాయక ప్రజలు కూడా తమ ప్రాణాలను కోల్పోతున్నారు. నగరం పశ్చిమ, ఉత్తర భాగాలకు ఇజ్రాయెల్ ట్యాంకులు బలవంతంగా ప్రవేశించాయి, ఇప్పటికే తూర్పు, దక్షిణం, మధ్యభాగాలను ఆ దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

విమానాలు, ట్యాంకులు, ఓడల నుండి కాల్పులు జరపడం వల్ల ఎక్కువ మంది ప్రజలు నగరం నుండి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. శరణార్థి శిబిరాల్లో ఉగ్రవాదులు తలదాచుకుంటారనే అనుమానంతో వాటిపై కూడా ఇజ్రాయెల్ దళాలు దాడులు చేయడంతో అక్కడి నుంచి కూడా ప్రజలు తరలిపోతూ కొత్త సురక్షిత ప్రాంతాలను వెతుక్కుంటున్నారు.

గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా పేర్కొన్న దాని ప్రకారం, పశ్చిమ రఫాలో మానవతా సేఫ్ జోన్‌గా గుర్తించబడినని మవాసిలో గుడారాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్న కుటుంబాలపై ఇజ్రాయెల్ దళాలు బాంబు దాడులు చేయడంతో 25 మంది పాలస్తీనియన్లు మరణించారని, 50 మంది గాయపడ్డారని, వీరి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. నిరాశ్రయులైన పేద ప్రజల గుడారాలను ఇజ్రాయెల్ దళాలు కాల్చివేశాయని అక్కడి నివాసితులు తెలిపారు. అయితే ఈ ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్ మిలటరీ, మవాసిలో మా దళాలు దాడి చేసినట్లు ఎలాంటి సమాచారం లేదని, దీనిని సమీక్షిస్తున్నట్లు తెలిపింది.

Advertisement

Next Story